తెలుగుదేశం పార్టీ తరుపున అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నుండి టీడీపీ అభ్యర్థిగా నిలబడిన యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు సరిపెల్ల రాజేష్ పై రోజు రోజుకు వివాదం ముదురుతుంది. ఇప్పటికే తన అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక టీడీపీ,జనసేన నేతలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్న నేపథ్యంలో తల పట్టుకుంటున్న టీడీపీ అధిష్టానానికి ఇప్పుడూ బ్రాహ్మణ సంఘాలు సైతం షాక్ ఇస్తున్నాయి.
మహాసేన అనే సంస్థని ఏర్పాటు చేసుకున్న సరిపెల్ల రాజేష్ నిత్యం బ్రాహ్మణ సామాజిక వర్గంపై, హిందువులపై ఇప్పటికే పలుమార్లు చెప్పలేని స్థాయిలో దూషించిన ఘటనలు ఉన్నాయి. అయితే సమాజంలో తీవ్రమైన విద్వేషాలు రగిల్చే ఇలాంటి వ్యక్తికి చంద్రబాబు పి.గన్నవరం శాసనసభకి స్థానం కేటాయించడంపై ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
బ్రాహ్మణులను, హిందువులను, కాపులని ఇలా అన్ని వర్గాల వారిని తీవ్ర పదజాలంతో కించపర్చిన రాజేష్ కి టికెట్ ఎలా ఇస్తారని వారు సూటిగానే చంద్రబాబుని ప్రశ్నిస్తున్నారు. ఈ చర్యతో చంద్రబాబు బ్రాహ్మణులను ఓట్లు అడిగే హక్కును కూడా కోల్పోయారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజేష్ కి కేటాయించిన టికెట్ ను వెనక్కి తీసుకుని తక్షణమే బ్రాహ్మణ సమాజానికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.