బిజెపితో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నించి సఫలీకృతమయ్యాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. మొదటి దశ ,రెండో దశ పొత్తులు, సీట్ల ప్రకటన అంత సవ్యంగా సాగింది. కూటమిలో భాగంగా బిజెపికి 6 పార్లమెంటు 10 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నారా చంద్రబాబునాయుడు తెలివిగా టిడిపి గత రెండు దశాబ్దాలుగా గెలవని సీట్లను బీజేపీ ఖాతాలో వేసేసాడు. మొదట చర్చల్లో భాగంగా బిజెపి నుంచి షేకావత్ హాజరు అయ్యాడు. ఈ చర్చలకి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ఆహ్వానం అందలేదు.
చర్చల తర్వాత బీజేపీ అంతర్గత సమావేశంలో అసలు విషయం బయటపడింది. చంద్రబాబు తమను మోసం చేసి టిడిపి ఓడిపోయే సీట్లని బిజెపికి కేటాయించారని తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రకటించిన ఆ సీట్లలో పోటీ చేస్తే బిజెపి కచ్చితంగా ఓడిపోతుందని ఏపీ బీజేపీ నేతలు, బిజెపి అధ్యక్షుడికి లేఖ రాశారు. బిజెపి ఏఏ స్థానాల్లో పోటీ చేస్తుందో చంద్రబాబుకి ముందుగా తెలియజేసినప్పటికీ బిజెపి అభ్యర్థులను ప్రకటించడంలో లేట్ అయ్యేసరికి చంద్రబాబు తెలివిగా బిజెపి అడిగిన స్థానాలలో తన అభ్యర్థులని ప్రకటించేశాడు. తమ పార్టీకి కేటాయిస్తారని భావించిన చోడవరం,మాడుగుల,రాజమండ్రి సిటీ, గుంటూరు వెస్ట్, శ్రీకాళహస్తి, కదిరి సీట్లను చంద్రబాబు ప్రకటించడంపై ఏపీ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
బిజెపి మొదటి నుంచి తాము బలంగా ఉన్నాం అనుకుంటున్న రాయలసీమలో నాలుగు అసెంబ్లీ స్థానాలు స్థానాలు, కోస్తాలో మూడు అసెంబ్లీ స్థానాలు, ఉత్తరాంధ్రలో మూడు అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయాలని కోరుకుంది. బిజెపి అనుకున్నట్లుగానే పొత్తులో భాగంగా 10 సీట్లు అయితే లభించాయి కానీ అవి వారు పోటీ చేయాలనుకున్న స్థానాలు అయితే కాదు. పొత్తులో భాగంగా బిజెపి అనుకున్న ఒక సీటు కూడా బిజెపికి దక్కలేదంటే చంద్రబాబు చాణిక్యత ఇక్కడ మనం గమనించాల్సిందే . మరి కొన్ని చోట్ల కింది స్థాయి నుంచి నియోజవర్గ స్థాయి వరకు క్యాడర్ లేని అనపర్తి లాంటి నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సి వస్తోంది బిజెపికి, అలాంటి చోట పోటీ చేసినా ఉపయోగం లేదని ఇప్పటికే తమ అధినాయకత్వానికి బిజెపి నాయకులు తెలిపారు.
తాము కేటాయించిన స్థానాల్లో అభ్యర్థులను మార్చితే సమస్యలు వస్తాయని నారా చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు. ఇప్పటికే మొదట ఒప్పందం చేసుకున్న స్థానాల నుంచి పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు కోరుతున్న దానికి ఆంధ్ర బిజెపి నేతలు ససేమీర అంటున్నారు. ఏపీ బీజేపీ నేతలు తాము ప్రతిపాదించిన సీట్లలో పోటీ చేస్తామని అప్పుడే బిజెపికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని కేంద్ర అధినాయకత్వానికి లేఖ రాశారు. ఈ విషయమై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు ఢిల్లీకి వెళ్లారు.టిడిపి ప్రతిపాదించిన స్థానాలలో పోటీ చేస్తే విజయ అవకాశాలు లేవని, భవిష్యత్తులో బిజెపి పార్టీ ఆంధ్రప్రదేశ్లో కనుమరుగు అయిపోతుందని బిజెపి నాయకులు తెలిపారు. బిజెపి ఎంపీ స్థానాలతో పాటుగా అసెంబ్లీ స్థానాలు పైన పట్టుబడుతోంది. దీంతో చంద్రబాబు బిజెపి చేస్తున్న తాజా ప్రతిపాదనలో వేటికి అంగీకరిస్తారు చివరికి ఏ స్థానాల్లో మార్పులు జరుగుతాయనేది మరో రెండు మూడు రోజులు వేచి చూడాల్సిందే.