మతతత్వ రాజకీయాలే పునాదిగా పుట్టిన బీజేపీ రాజకీయ ఆలోచనలు, వారి అజెండాలు ఈ రోజు రాష్ట్ర ప్రజలకి కొత్తగా పరిచయం చేయనక్కరలేదు. ఈ దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన మతతత్వ అజెండాతోనే ముందుకు వెళ్ళే బీజేపీ ఆ అజెండాతోనే ఇప్పుడు ఎన్నికలకి కూడా సిద్దమైనట్టు వారి ఆలోచనలు బట్టి తెలుస్తుంది. తెలంగాణ ఎన్నికల సమయంలో తమకి అధికారం ఇస్తే రాష్ట్రంలో అమలులో ఉన్న ముస్లిం 4% రిజర్వేషన్లను రద్దు చేస్తాం అంటూ బీజేపీ ఒక సంచలన ప్రకట చేసిన విషయం తెలిసిందే.
ముస్లింల వెనుకబాటుతనాన్ని చూసి వారి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలనే ఆలోచనతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్సార్ గారు ముస్లింల రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టారు. ఆయన కృషి ఫలితంగానే నేడు తెలుగు రాష్ట్రాల్లో వెనుకబడిన 15 ముస్లిం ఉపకులాలకు దక్కిన రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకుని వేలాది మంది ఉద్యోగాలు పొందారు. ధనికులకే పరిమితమైన వైద్య విద్యలో ఉచితంగా సీట్లు పొందారు. డాక్టర్లుగా స్థిరపడ్డారు.
15 ముస్లిం ఉపకులాలను బీసీ–ఈ జాబితాలో చేర్చి విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2004–05లో దివంగత నేత వైయస్సార్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. కొంతమంది వ్యతిరేకించినా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఆర్డినెన్స్ తీసుకువచ్చి.. 2007 జూలై 7న జీవో నంబర్ 23, బీసీడబ్ల్యూ(సీ2) జారీ చేశారు. ఆ నిర్ణయాలు సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఫలితంగా ఆర్డినెన్స్ను నిలుపుదల చేస్తూ అప్పట్లో ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రిజర్వేషన్లు తాత్కాలికంగా రద్దయ్యాయి. వెనకడుగు వేయని వైయస్సార్ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో రిజర్వేషన్ల అమలుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అయితే, రాజ్యాంగ సూచిక ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చూడాలని ఆదేశించింది. దీంతో ముస్లింలకు కల్పించిన 5 శాతం రిజర్వేషన్లను 4 శాతానికి కుదించి వైఎస్సార్ అమలులోకి తెచ్చారు.
వెనుకబాటుతనంతో మగ్గిపోతున్న ముస్లింల లోని కొన్ని ఉప కులాలకి ఆశా దీపంగా మారిన ఈ రిజర్వేషన్లను నేడు బీజేపీ అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటూ బహిరంగంగానే ప్రకటించింది. అయితే బీజేపీ ప్రకటన తరువాత కూడా తెలుగుదేశం , జనసేన ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆ రిజర్వేషన్లు రద్దుకు వారు సైతం అంగీకరించినట్లే అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ముస్లింలకు రిజర్వేషన్ల రద్దు ప్రధాన ఎన్నికల అస్త్రంగా వాడుతున్న బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ జనసేన ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఎన్నికలకు సమాయత్తమవడాన్ని ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ విషయంలో టీడీపీ జనసేన ఒక స్టాండ్ తీసుకుని క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ప్రకటన కోసం రాష్ట్రంలో ముస్లింలంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన టీడీపీ తీసుకునే స్టాండ్ ఎలా ఉంటుందో మరికొద్ది రోజుల్లో తేలనుంది.