ఎవరితో పొత్తు పెట్టుకుంటే వారిని భస్మం చేసే అలవాటు ఉన్న చంద్రబాబు ఈ పొత్తులో కొత్త అస్త్రం బయటపెట్టారు. సాధారణంగా అన్నీ అయిపోయాక తన వాటం చూపే చంద్రబాబు ఈ సారి బీజేపీతో పొత్తులో ఇరకాటంలో పడుతున్నారు.
ఎక్కడ మైనారిటీల ఓట్లు పోతాయో అని చంద్రబాబుకు భయం పట్టుకుంది. ఒక వైపు ఆంధ్ర బీజేపీ నేతలు ముస్లింలఖు 4% రిజర్వేషన్ల గురించి తెలిసే చంద్రబాబు తమతో పొత్తుకు ఒప్పుకున్నారనీ, ఆంధ్ర లో అది అమలుచేయడం తధ్యం అనీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో మైనారిటీలో తెదెపా మీద కోపం పెరిగింది.
ఈ దెబ్బతో రంగంలోకి దిగిన బాబు మైనారిటీల మనోభావాలకు రిపేర్లు చేసే పనిలో భాగంగా బీజేపీని తక్కువ చేసి మాట్లాడారు. దానితో భగ్గుమన్న ఏపీ బీజేపీ నేతలు చంద్రబాబు వైఖరి పై కారాలూ మిరియాలూ నూరుతున్నారు. పొత్తు కోసం ఢిల్లీలో అమిత్షా ఇంటి ముందు రోజుల తరబడి నిలబడి, బతిమిలాడుకుని… తీరా ఇప్పుడు పొత్తులోకి వచ్చాక బీజేపీని ఇలా తక్కువ చేసి మాట్లాడమేంటని మండిపడుతున్నారు.
బాబు సాధారణంగా ఏరు దాటాక తెప్ప తగలేసే రకమనీ, కానీ ఈ సారి మాత్రం ముందే తగలేస్తున్నారని, ఈ విషయమై ఢిల్లీ బీజేపీ పెద్దలకు లేఖ రాయాలని ఏపీ బీజేపీ నాయకులు నిర్ణయించుకున్నారు. బీజేపీ ప్రతిష్ట దెబ్బ తినేలా మాట్లాడినందుకు బాబుపై హైకమాండ్ కు ఫిర్యాదు చేయనున్నారు.