‘రోజులు అసలే బాగోలేవు. ఇంట్లో నుంచి బయటికెళ్లిన ఆడపిల్ల తిరిగొచ్చే వరకు భయంగానే ఉంటుంది. ఆయన ఉండుంటే బాగుండేది. ఎంతో ధైర్యంగా ఉండేవాళ్లం’ గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల యాడ్ ఇది. కానీ మాటలకు.. చేతలకు అసలు పొంతనే ఉండదు. బీసీ మహిళను టీడీపీ, కూటమిలోని జనసేన సైకోలు పొట్టన పెట్టుకుంటే ఆ పార్టీల పెద్దలు వారి వెనుకేసుకొస్తూ బాధితురాలిపైనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తమది బీసీల పార్టీని బాబు నిత్యం చెబుతుంటారు. అలాంటి వెనుకబడిన తరగతులకు చెందిన మహిళ విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
బీసీలపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని వీలు చిక్కినప్పుడల్లా టీడీపీ చెబుతూ ఉంటుంది. వారికి సంబంధించిన కోర్టు కేసుల్లో ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని అనేకసార్లు మినీ మేనిఫోస్టోల్లో పెట్టారు. ఇటీవల జరిగిన జయహో బీసీ సభలో దేశంలో ఎక్కడా లేని విధంగా రక్షణ చట్టం తెస్తామని బాబు గ్యాంగ్ ఊదరగొట్టింది. మరోవైపు మహిళలకు భద్రత కావాలంటే.. చంద్రబాబు రావాలని నారా భువనేశ్వరి క్యాంపెయిన్ చేస్తున్నారు.
ఆ రెండు పార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలే తెనాలికి చెందిన బీసీ మహిళ గీతాంజలిని వేధించి ఆమె చావుకు కారణమయ్యారు. ఈ ఘటనలో టీడీపీ వ్యవహరించిన తీరును చూసి వెనుకబడిన తరగతుల విషయంలో ఇప్పటి వరకు తెలుగు తమ్ముళ్లు చెప్పినవన్నీ అబద్ధాలేనని తేలిపోయింది. రక్షణ చట్టం తెస్తామని చెప్పిన వారు గీతాంజలి కుటుంబానికి అండగా నిలబడకుండా ఫేక్ ప్రచారాలు చేస్తూ మానసికంగా వేధిస్తున్నారు. రెండు పార్టీలు కనీసం సంతాపం కూడా తెలపలేదు. చావుకు కారణమైన తమ వారిని మందలించలేదు. సాటి మహిళ చనిపోతే భువనేశ్వరి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి బాబు అధికారంలోకి వస్తే ఆడవారికి భద్రత ఎలా ఉంటుందో ఆమే చెప్పాలి. బాబు భార్య దృష్టిలో తమ పార్టీలో ఉండేవారు.. సపోర్టు చేసే వారే మహిళలా.. మిగిలిన వారు కాదా.. అని సమాజం ప్రశ్నిస్తోంది.
బీసీల పార్టీని చెప్పుకొనే వారు మహిళ చావు విషయంలో రాజకీయాలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. లోకేశ్ ట్వీట్లు పెడుతూ రెచ్చగొడుతున్నారు. తప్పు జరిగిందని కొందరు తెలుగు తమ్ముళ్లే పోస్టులు పెట్టి తమ వారిని తిడుతుంటే నేతలు మాత్రం చావుకు కారణమైన వారికి సపోర్టుగా నిలుస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే.. పొరపాటున అధికారంలోకి వస్తే మహిళలకు భద్రత ఉంటుందా.. బీసీలను పట్టించుకుంటారా.. అనే అనుమానాలు రాక మానవు.