టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడో భారతీయ జనతా పార్టీ పెద్దలకు బాగా తెలుసు. తాజా పరిణామాలతో ఇంకా బాగా తెలిసి వస్తుంది. ఎన్డీఏలో చేరే వరకూ కాళ్ల బేరానికి దిగిన బాబు.. రోజుల వ్యవధిలోనే నిజస్వరూపం బయటపెట్టాడు. బీజేపీకి కేవలం 10 అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ సీట్లు ఇవ్వగా వాటిలో తన వర్గం వారే పోటీ చేసేలా చక్రం తిప్పుతున్నారు. మొదటి నుంచి కాషాయ కండువా కప్పుకొన్న వారికి టికెట్లు దక్కకుండా చూస్తున్నారు. ఇందుకు ఏపీ కమలం చీఫ్ దుగ్గుబాటి పురందేశ్వరి పూర్తి సహకారం అందిస్తున్నారు.
చంద్రబాబు బీజేపీలోకి పంపితే వెళ్లి వ్యక్తి సీఎం రమేష్. కడప జిల్లాకు చెందిన ఇతను ఇప్పటికీ టీడీపీ కోసమే పనిచేస్తున్నాడు. తాజాగా బాబు చింతకాయల అయ్యన్నపాత్రుడి తనయుడిని కాదని రమేష్కు అనాకపల్లి సీటు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు ఆయనకే ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని భావించి మాజీ ఎంపీ మాధవ్ అనకాపల్లి టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పుడు ఆయన్ను కూడా పక్కన పెట్టేశారు. ఇక జీవీఎల్ నరసింహారావుకు విశాఖ సీటు దక్కకుండా చంద్రబాబు, పురందేశ్వరి ఒక పద్ధతి ప్రకారం పనిచేసుకుంటూ వెళ్లారు. ఆమె విశాఖలో ఓడిపోతామని అధిష్టానానికి అబద్ధాలు చెప్పి అనకాపల్లి స్థానం కమలం ఖాతాలో వచ్చేలా చేశారని విమర్శలున్నాయి.
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాజకీయ భవిష్యత్ను బాబు గ్యాంగ్ ప్రశ్నార్థకం చేసేసింది. ఆయన తన సొంత నియోజకవర్గమైన రాజమండ్రి నుంచి ఎంపీగా బరిలో దిగాలని ప్రయత్నిస్తున్నారు. కానీ సోదరి భర్త అయిన నారా వారి అండతో పురందేశ్వరి ఆ సీటుపై కన్నేశారు. ఇక అరకు స్థానాన్ని సీనియర్ నేతలకు కాదని కొత్తపల్లి గీతకు ఇప్పించాలని చూస్తున్నారు. బాబు చెప్పినట్లు ఆడే రఘురామకృష్ణరాజును బీజేపీలోకి పంపి బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బాబు మనుషులైన కామినేని శ్రీనివాస్ కైకలూరు నుంచి, ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి, వరదాపురం సూరి ధర్మవరం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు పురందేశ్వరి సీనియర్ నేతలకు చెక్ పెట్టి వీరికి ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. 2014 నుంచి దేశాన్ని శాసిస్తున్న బీజేపీ ఒక్క ఏపీలో మాత్రం బాబు కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. కమలం రంగు కాస్త పచ్చగా మార్చేందుకు నారా వారి మనుషులు తమవంతుగా కృషి చేస్తున్నారు.