బీజేపీతో పొత్తు కోసం నిద్రాహారాలు మాని ఢిల్లీ పెద్దల కరుణ కోసం పడిగాపులు గాసిన చంద్రబాబు బీజేపీతో పొత్తును నేను కోరుకోలేదు,వాళ్ళే నన్ను అడిగారు అంటూ నాలుకను అడ్డంగా మడతబెట్టారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం టీడీపీ పరిస్థితి పూర్తి పతనావస్థకు చేరిపోయింది. ‘పార్టీ లేదు బొ* లేదు’ అంటూ సొంత పార్టీ నేతలే టీడీపీ పరిస్థితిని బట్టబయలు చేశారు. పార్టీని తిరిగి బ్రతికించుకోవడం కోసం చంద్రబాబు, లోకేష్ చేయని ప్రయత్నం లేదు. దీనికి తోడు చంద్రబాబు కేసుల్లో ఇరుక్కుని జైలు పాలవ్వడంతో పార్టీని నడిపించే నాయకుడు లేక టీడీపీ పూర్తిగా బలహీన పడింది. ఆ సమయంలో పార్టీని నడిపిస్తాడనుకున్న లోకేష్ ఏమో ఢిల్లీ వెళ్లి దాక్కున్నాడు. దీంతో టీడీపీని నిలబెట్టే బాధ్యతను దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తన భుజ స్కందాలపై వేసుకున్నాడు.
జైలులో ఉన్న చంద్రబాబును కలిసి టీడీపీ జనసేన కూటమిగా పోటీ చేస్తాయంటూ ప్రకటించిన పవన్ కళ్యాణ్ తన పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడం మాని టీడీపీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాడు. ఢిల్లీ పెద్దల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటూ బీజేపీ పెద్దల కాళ్ళూ వేళ్ళూ పట్టుకున్నాడు. వాళ్ళు ససేమిరా అంటున్నా వినకుండా పట్టువిడవకుండా పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు. పవన్ తో పాటు చంద్రబాబు కూడా బీజేపీ పెద్దల ప్రసన్నం కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.
ఒంటరిగా తాము పోటీ చేస్తే జగన్ ని ఎదుర్కోవడం కష్టమని భావించడంతో పాటు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే సిస్టం సపోర్ట్ తమకి ఉంటుందన్న అత్యాశతో బీజేపీతో పొత్తు కోసం తహతహలాడిన చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ త్యాగరాజులా మారిపోయాడు. పొత్తు చంద్రబాబుకు అత్యవసరమైనా చంద్రబాబు కోసం తన సీట్లనే త్యాగం చేసిన గొప్ప వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చరిత్రలో నిలిచిపోయాడు. టీడీపీ శ్రేయస్సు కోసం తన సీట్లను, తన పార్టీని, తన అభిమానులను పణంగా పెట్టి మరీ పొత్తుకు ఒప్పించాడు. టీడీపీ, జనసేన దేహీ ప్రభో అంటూ ప్రాథేయ పడటంతో రాష్ట్రంలో కేవలం 1% ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు ఆయాచితంగా దక్కాయి.
వ్యవస్థల సహకారం లభిస్తుందన్న ఏకైక కారణంతో బీజేపీతో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడాడన్నది జగమెరిగిన సత్యం. చంద్రబాబు బాగు కోసం పవన్ కళ్యాణ్ తన పార్టీనే తాకట్టు పెట్టాడన్నది బహిరంగ రహస్యం. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీ, క్రిస్టియన్ వర్గాల ఓట్లు దూరం అవుతాయని భావించి ఇప్పుడేమో పొత్తు కోసం బీజేపీనే ముందుకొచ్చింది అంటూ మాట మారుస్తున్నాడు చంద్రబాబు. ఇప్పటికే టీడీపీతో బీజేపీ పొత్తు ఒప్పించడానికి ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకున్నానని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు మాత్రం ముస్లిం ఓట్ల కోసం మాట మార్చి చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓట్ల కోసం బాబు మార్చే రంగులు చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందేమో అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.