Appreciations to Nature Forming in AP : వ్యవసాయ రంగం మారుతోంది. రసాయనాలు వినియోగించే సాగు చేసే పద్ధతి నుంచి ప్రకృతి వ్యవసాయం(Nature Forming) పై రైతాంగం క్రమంగా మళ్లుతోంది. ఇది ఒకటి, రెండు రోజుల్లో జరిగేది కాదు. కానీ భవిష్యత్ తరాలు ఆరోగ్యవంతమైన జీవితం గడపాలంటే తప్పనిసరిగా జరగాల్సిన మార్పు. ఈ విషయాన్ని గ్రహించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ తరహా వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. దీనికి సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
చక్కటి పరిష్కారం
మితిమీరి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడితే రైతు తీవ్రంగా నష్టపోతాడు. ఈ పంట వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. అదే ప్రకృతి సాగును పరిశీలిస్తే ఈ పరిస్థితులు కనిపించవు. సంప్రదాయ జీవ ఎరువులతో చేసే వ్యవసాయంలో 11 శాతం అధిక దిగుబడులు వస్తాయి. అన్నదాతల జీవితాలు మారుతాయి. సమాజం ఆరోగ్యకరంగా తయారవుతుంది. భవిష్యత్లో ఎదురయ్యే ఆహార సంక్షోభానికి చక్కటి పరిష్కారం ప్రకృతి వ్యవసాయం.
ప్రభుత్వ ప్రోత్సాహం
ఏపీ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా అగ్రికల్చర్ అధికారులు, శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో రైతులకు ఈ విధానంపై నిత్యం అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాలను ఎంపిక చేసి ప్రకృతి విధానంలో సాగు చేయిస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది బీజామృతం, ఘన, ద్రవ జీవామృతం, గుళికల తయారీ గురించి వివరిస్తున్నారు. దీంతో రసాయన ఎరువులు వాడితే వచ్చే దిగుబడి, ప్రకృతి సాగు ద్వారా వచ్చే దిగుబడికి ఏ స్థాయిలో తేడా ఉంటుందో రైతాంగానికి స్పష్టంగా తెలుస్తోంది. దీంతో ఈ సాగుకు అనేకమంది ముందుకొస్తున్నారు.
క్షేత్రస్థాయిలో చూసి..
తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు, బొమ్మనహాళ్ ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయ (Nature Forming ) పద్ధతుల్లో సాగవుతున్న పంటలను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు తదితరులతో కూడిన బృందం సోమవారం పరిశీలించింది. షార్జాకు చెందిన షేక్ ముజీద్, అలఖ్ అస్సీమి, ఫ్యూచర్ ఎకనమిక్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు వాల్టర్ లింక్, షేక్ మజీద్ అసోసియేట్ యాజెన్ అల్కొద్మని (ఇటలీ), ప్రపంచ బ్యాంక్ సీనియర్ సలహాదారులు నలిన్ కిశోర్, అశోక్ వైష్, జేశ్దీప్ సహదేవ్ (అమెరికా)లు పంటలను చూసి రైతులతో మాట్లాడారు. వారు, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్కుమార్, ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు జిల్లా మేనేజర్ లక్ష్మానాయక్ నుంచి సాగు వివరాలు తెలుసుకుని అభినందించారు. ఈ విధానంతో అద్భుత ఫలితాలు వస్తున్నాయని, ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి ప్రసంశలు అందించారు.
అంతర్జాయ సంస్థ ప్రకటన
ఏపీలో ప్రకృతి వ్యవసాయ విధానం మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శనీయమని ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్లోబల్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ టూల్కిట్ ఇంపాక్ట్ సంస్థ గదేడాది ప్రకటించింది. జగన్ ప్రోత్సాహంతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ పర్యావరణానికి అతిపెద్ద మార్పుగా అభివర్ణించింది. గ్లోబల్ అలయన్స్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ సంస్థ మద్దతుతో టూల్కిట్ ఇంపాక్ట్ సంస్థ గత ఏడాది రాష్ట్రంలో అధ్యయనం చేసి ఫలితాలు వెల్లడించింది. కోస్తా, రాయలసీమ, డెల్డా ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించి భావితరాల కోసం ఆహార వ్యవస్థలో మార్పు తేవడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కొనియాడింది. సాగులో మహిళల ప్రాత ఉండటంతో కుటుంబాల మధ్య ఐక్యత, అన్యోన్యత పెరుగుతున్నట్లు గుర్తించింది. ప్రకృతి సాగు ద్వారా నీటి కొరత, కాలుష్యం, ఉపాధి తదితర ఎన్నో సవాళ్లను రైతులు అధిగమిస్తున్నారని ఆ అధ్యయనం తెలిపింది. ఏపీని స్ఫూర్తిగా తీసుకుని ప్రకృతి వ్యవసాయంలో ముందుకెళ్లాలని తమ భాగస్వామ్య దేశాలకు సిఫార్సు చేస్తున్నట్లు ఇంపాక్ట్ సంస్థ ప్రకటించింది. జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే విదేశీ సంస్థలు, అక్కడి శాస్త్రవేత్తలు తదితరులు మన రాష్ట్రంలో ప్రకృతి సాగు విధానంపై ప్రశంసలు కురిపించారు. సీఎం దూరదృష్టిని అభినందించారు.
– వీకే..