టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వలంటీర్లపై నిత్యం అక్కసు వెళ్లగక్కుతుంటారు. పచ్చ పత్రికలైతే రోజూ వారిపై బురద వేస్తుంటాయి. కానీ ఆ సేవా సైన్యం ఏ మాత్రం కూడా నెరవకుండా తమ పని చేసుకుంటూ వెళ్తుంటారు. ఎక్కడో ఒకరు చేసే తప్పును మొత్తం వ్యవస్థకు ఆపాదించి చూసే ఎల్లో గ్యాంగ్కు వారి మంచి పనులు కనిపించవు.
బాపట్ల జిల్లా బల్లికురవ మండలం రామాంజనేయపురంలో తల్లి మందలించిందని గోపీచంద్ అనే 17 ఏళ్ల యువకుడు పురుగు మందు తాగాడు. కుమారుడి పరిస్థితిని చూసిన తల్లి సీ వన్ క్లస్టర్ వలంటీర్ బత్తుల రమేష్బాబు సాయం కోరింది. బీఎస్సీ నర్సింగ్ చదివిన అతను వెంటనే స్పందించాడు. గోపీచంద్కు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నరసారావుపేటలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. యువకుడి ప్రాణాలు కాపాడి శభాష్ అనిపించుకున్నాడు.
విశాఖపట్నం జీవీఎంసీ 79వ వార్డులో వలంటీర్గా గొంతిన రాము అనే మహిళ పనిచేస్తున్నారు. ఆమె ఆదివారం ఆటోలో నుంచి జారిపడ్డారు. తలకు తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబసభ్యులు తొలుత ప్రైవేట్ ఆస్పత్రికి.. అటు నుంచి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా రాము బ్రెయిన్డెడ్ అయ్యింది. దీంతో భర్త శివ, ఇద్దరు కుమారులు కన్నీరుమున్నీరయ్యారు. భార్య అవయవాలను దానం చేసేందుకు శివ ముందుకొచ్చారు. కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో అవయవాలను తొలగించి భద్రపరిచి జీవనధార ట్రస్ట్కు అందజేశారు. వలంటీర్ కుటుంబం గొప్ప నిర్ణయం తీసుకుందని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. రాము మృతదేహానికి గౌరవ వందనంతో వీడ్కోలు పలికారు. ఇలాంటి వలంటీర్లకు సెల్యూట్ చేయాల్సింది పోయి తిడితే ఎలా ఎల్లో గ్యాంగ్. ఏమో రేపు మీకు వారి అవసరం పడొచ్చు. అప్పుడు మీ తిట్లను మర్చిపోయి సేవ చేస్తారు.