రైతన్నకు మేలు చేసేలా జగన్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అందులో భాగంగా మద్దతు ధరకు మించి రైతుల నుంచి నేరుగా కందులు కొనుగోలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. దీంతో రైతుకు మార్కెట్ రేటుతో సమానంగా ధర దక్కనుంది. ప్రభుత్వ నిర్ణయంతో కంది రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
కేంద్రం క్వింటా కందుల మద్దతు ధర రూ.7 వేలుగా ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు మార్కెట్లో ఉన్న రేటుకే రూ. 9,500 నుంచి రూ.10 వేలు చెల్లించి కొంటోంది. ఈ సీజన్ లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 20వేల టన్నుల కందులు సేకరించనుంది. గతంలో రైతులు కందులను మార్కెట్కు తీసుకువెళ్లి విక్రయించాల్సి వచ్చేది కానీ గోనె సంచులు, హమాలీలు, రవాణా(జీఎల్టీ) ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించడంతో రైతులకు మరింత ప్రయోజనం చేకూరనుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 2,500 టన్నులు కందులు సేకరించి, 600 టన్నులకు పైగా కందిపప్పును ప్రాసెసింగ్, మిల్లింగ్ చేసి వినియోగదారులకు సరఫరా చేస్తుంది. కందులను కొన్న రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాలో నగదును ప్రభుత్వం జమ చేస్తుంది