ప్రతి ఏడాదీ జరిగినట్టే,రిపబ్లిక్ దినోత్సవం నాడు ఢిల్లీ లో జరిగిన పెరేడ్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తన అభివృద్ధి మార్గాన్ని శకటం ద్వారా ప్రదర్శించి బహుమతి గెలుచుకుంది.
ఈ సారి ఆంధ్ర ప్రదేశ్ శకటానికి పీపుల్స్ చాయిస్ విభాగంలో మూడవ బహుమతి లభించింది. జగన్ ప్రభుత్వం విద్యారంగంలో ప్రవేశ పెట్టిన సంస్కరణలను వివరిస్తూ ఈ శకటం తయారు చేశారు. కర్తవ్య పథ్ లో వికసిత భారత్ థీమ్ నిబంధనలకు అనుగుణంగా ఈ శకటాన్ని రూపు దిద్దారు. విద్యారంగంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రవేశ పెట్టిన విప్లవాత్మక సంస్కరణలు ఈ శకటం ద్వారా అందరినీ అబ్బుర పరిచాయి. ప్రథమ ద్వితీయ బహుమతులు వరసగా గుజరాత్, ఉత్తర ప్రదేశ్ లకు లభించాయి.
అయితే ఇంతకు ముందు టీడీపీ అధికారంలో ఉన్నపుడు బహుమతుల సంగతి దేవుడెరుగు,అధికారులకు చీవాట్లు మాత్రం సమృద్ధిగా దొరికాయి. శకటాల మోడల్స్ ని ఆమోదించే శాఖ ఆంధ్ర అధికారుల జాప్యానికి విసుగు చెంది చీవాట్లు పెట్టారు. మూడు సార్లు సమావేశం జరిగినా, మూడో సారి కూడా అధికారులు తమ మోడల్ ని చూపించక పోవడం తో నిపుణులు అభ్యంతరం చెప్పారు అప్పట్లో. మోడల్ డిజైన్ లో మార్పులు చేసి తీసుకు రావాలని ముందటి సమావేశాల్లో చెప్పినా, నిమ్మకు నీరెత్తినట్టు, నిపుణుల సూచనల్ని బేఖాతరు చేసి, అదే డైజన్ తో మూడో సారి కూడా సమావేశానికి అధికారులు హాజరయ్యారు. దాంతో విసుగు చెందిన నిపుణులు, “ఈ డిజైన్ ని మేము చూడం., మోడల్ ని తీసుకు రండి” అని తెగేసి చెప్పడంతో ” మోడల్ ని రైల్లో తెస్తున్నాం” అని చెప్పి తాత్కాలికంగా తప్పించుకున్నారు అధికారులు.