గుంటూరు జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగబాబు టీడీపీకి గుడ్ బై చెప్పారు. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తానని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. వివరాల్లోకి వెళితే
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. తాజాగా టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న రాయపాటి రంగారావు(రంగబాబు) ఆ పదవికి రాజీనామా చేయడంతో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ‘తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మరియ టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నాను. నాకు సహకరించిన రాయపాటి కుటుంబ అభిమానులకు, నాయకులకు మరియు కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలో నా భవిష్య కార్యచరణ తెలియజేస్తాను. ఎల్లప్పుడు మీ అభిమానం, ప్రేమ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాని రాయపాటి రంగారావు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.
కాగా రాయపాటి రంగారావు అధికార వైఎస్సార్సీపీలోకి వెళ్లనున్నారనే ఊహాగానాలున్నాయి. ఇప్పటికే కృష్ణా జిల్లాలో ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యే కృష్ణదాస్ టీడీపీనుండి వైఎస్సార్సీపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశం లేదని తేలడంతో వైఎస్సార్సీపీలోకి వెళ్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.