ఈ మాట చంద్రబాబు నాయుడు కాకుండా వేరే ఏ ముఖ్యమంత్రి అయినా అనుంటే మనాళ్ళ మీడియా… ‘అసలు రైతులకు ఐప్యాడ్లు ఎందుకు, వాటితో వ్యవసాయం చేస్తారా, కుప్పలూడ్చేందుకైన అవి పనికొస్తాయా, ఐప్యాడ్లు ఇవ్వాలన్న ప్రభుత్వ ఆలోచన వెనకాల ఉద్దేశాలు ఏవైనా కావచ్చు – రాష్ట్రంలోని రైతులందరికీ ఐప్యాడ్లు ఇవ్వాలంటే ఎంత ఖర్చవుతుంది, సాధ్యాసాధ్యాల గురించి కనీస అవగాహన ఉన్న పాలకులెవరైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా, ఐప్యాడ్లకు ఖర్చయ్యే మొత్తంతో బ్యాంకుల్లో రైతులకున్న అప్పుల్ని మాఫీ చేస్తే వారికి కాస్తైనా ఉపశమనం కలుగుతుంది, ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోరు, రైతులకు ఉపయోగపడేవి చేయకుండా ఇలా ఐప్యాడ్లు ఇస్తే చివరికి రైతులు ‘ఫాం విల్లే’ అనే వీడియో గేములో మాత్రమే వ్యవసాయం చేయగలరు.. అసలు ఈ విషయంలో ప్రభుత్వ ధోరణి చూస్తుంటే ఈ ఐప్యాడ్ల కొనుగోలు పేరుతో ఖజానా నుంచి తమ జేబులు నింపుకునే దురాలోచనేదో చేస్తున్నట్టుగా ఉంది’ అంటూ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడేది.
(వైఎస్ జగన్మోహన్ రెడ్డి(జగన్) నేతృత్వంలోని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకిచ్చిన ఐప్యాడ్ల విషయంలో చేసిన(చేస్తున్న) రాద్ధాంతమే ఉదాహరణ).
కానీ ఇక్కడ ఆ మాట అనింది ‘మన’ చంద్రబాబు నాయుడు కావడంతో ఎప్పటిలాగే బోడిగుండుకు మోకాలికి ముడి పెడుతూ ఆయన మాట్లాడే టెక్నాలజీ మాటల్ని యథాతథంగా ‘అచ్చోసి’ వదిలారంతే. అయిదేళ్ళ పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎంత మంది రైతులకు ఐప్యాడ్లు ఇచ్చారో ఎవరికైనా తెలుసా? 2019 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతీ మంచి పని మీద దుమ్మెత్తిపోస్తూ, దాని వెనకాల జగన్ స్వలాభం ఏదో ఉందని నిరాధార ప్రచారం చేస్తున్న ఒక వర్గం మీడియా – ‘ప్రతి రైతుకూ ఐప్యాడ్’ అన్న చంద్రబాబు ప్రకటన కార్యరూపం దాల్చిందో లేదో ఏ నాడైనా ప్రశ్నించిందా ?
ఐప్యాడ్ల దాకా ఎందుకు ? 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి గల ప్రధాన కారణమైన రైతు రుణ మాఫీ హామీ అమలులో చంద్రబాబు వైఫల్యాన్నే మనాళ్ళ మీడియా ఏనాడూ ప్రజలకు చెప్పలేదు కానీ ఇప్పుడు మాత్రం ప్రతిపక్ష పార్టీల కన్నా ఎక్కువ రాజకీయాలు ఆ మీడియానే చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ దురదృష్టమేంటంటే ఆ వర్గం మీడియా రాతలు నిజాలనుకునే వారు, వాటిని ప్రామాణికంగా తీసుకుని కొన్ని విషయాలు చర్చించేవారు మన నాగరిక సమాజంలో ఇంకా కొందరు మిగిలి ఉండటం.