చంద్రబాబు లెక్కలు తప్పాయి. పవన్ కళ్యాణ్పై అభిమానులే భగ్గుమంటున్నారు. ఇద్దరూ పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చేస్తున్నామని గాలిలో మేడలు కట్టారు. సీట్ల ప్రకటన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇరు పార్టీల్లో నిరసనలు ఎగసిపడుతున్నాయి. రోడ్లపై బైఠాయింపులు, ఫ్లెక్సీల చించివేతలతో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు రెచ్చిపోతున్నారు. అదుపు చేయలేక అధినేతలు తలలు పట్టుకుంటున్నారు.
చంద్రబాబు తొలివిడతలో 94 అసెంబ్లీ సీట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. జనసేనకు 24 అసెంబ్లీ, మూడు ఎంపీ సీట్లు ఇవ్వగా పవన్ అందులో 5 మాత్రమే ప్రకటించారు. వాస్తవానికి సేనకు 50పైనే స్థానాలు వస్తాయని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భావించారు. అలా జరగలేదు. మరోవైపు రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన వారిని, పార్టీ జెండా మోసిన వారిని కాదని బాబు కొత్త వారికి టికెట్లు అమ్ముకున్నారు. దీంతో నిరసనల సెగ ఏకంగా కరకట్టలోని ఆయన ఇంటిని తాకింది.
చంద్రబాబు తబంళ్లపల్లె టికెట్ను జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి ఇచ్చారు. దీంతో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అనుచరులు రగిలిపోయారు. ఉండవల్లిలోని బాబు నివాసం వద్దకు వెళ్లి బైఠాయించారు. ఎవరికీ తెలియని వ్యక్తికి సీటు ఎలా ఇస్తారంటూ ఒకతను పెట్రోలు పోసుకునేందుకు యత్నించాడు. ఆత్మహత్యకైనా సిద్ధమని ప్రకటించాడు. దీంతో సీఐ అడ్డుకున్నారు. త్రీమెన్ కమిటీ సభ్యులు కొల్లు రవీంద్ర, నెట్టెం రఘురామ్, కొనకళ్ల నారాయణ వారించే ప్రయత్నం చేశారు. ఇంతలో చంద్రబాబు వచ్చి శంకర్ యాదవ్ మనుషులపై కన్నెర్ర చేశారు. ఎవరికి సీట్ ఇవ్వాలో నా ఇష్టమని, డిక్టేట్ చేయొద్దన్నారు.
నగరి టికెట్ను గాలి భానుప్రకాష్కు ఇచ్చారు. దీంతో ఎరచ్రందనం స్మగ్లర్ను అభ్యర్థిగా ప్రకటిస్తారా.. అంటూ ఆ ప్రాంత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేత రామానుజం చలపతి, మాజీ కౌన్సిలర్ లత తదితరులు ఇసుక, గ్రావెల్, బియ్యం, గంజాయిని పట్టుకుని వీటిని స్మగ్లింగ్ చేసిన వ్యక్తికి టికెట్ వద్దని డిమాండ్ చేశారు. దోచుకునే వ్యక్తికి ఓటు వేయాలా అంటూ చంద్రబాబు, లోకేశ్ను ప్రశ్నించారు.
జనసేనతో పొత్తును టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. తొలి జాబితాకు సంబంధించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో శెట్టిబలిజలకు ఒక్క స్థానం కూడా ఇవ్వలేదని కోపంగా ఉన్నారు. కోడుమూరు టికెట్ బొగ్గుల దస్తగిరికి ఇచ్చి తనను మోసం చేశారని ఇన్చార్జి ఆకెపోగు ప్రభాకర్ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. కాకినాడ రూరల్ టికెట్ను జనసేనకు చెందిన పంతం నానాజీకి కేటాయించారు. దీంతో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి వర్గీయులు నిరసన తెలిపారు. పార్టీ ఫ్లెక్సీలు చించేశారు. వెలగ లోవరాజు అనే కార్యకర్త చంద్రబాబును తిడుతూ పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా అడ్డుకున్నారు. కల్యాణదుర్గం టికెట్ను అమిలినేని సురేంద్రబాబుకు ఇచ్చి తనకు తీరని అన్యాయం చేశారని ఇన్చార్జి మాదినేని ఉమా మహేశ్వరనాయుడు బోరున విలపించారు.
రాజమహేంద్రవరం రూరల్ టికెట్ జనసేనకు చెందిన కందుల దుర్గేష్కు కేటాయించినట్లు ఎల్లో మీడియా ప్రకటించింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలగడంతో బాబు మెట్టు దిగారు. పవన్తో మాట్లాడి ఆ సీటు బుచ్చయ్యకే ఇవ్వాలని భావిస్తున్నారు. దుర్గేష్ను నిడదవోలు నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. బుచ్చయ్యకు టికెట్ ఇస్తే ఓడిస్తామని జనసేన నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. నిడదవోలులో దుర్గేష్ను నిలబెడితే సహించేదిలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. బూరుగుపల్లి శేషారావుకు అభ్యర్థిత్వం ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు. నెల్లూరు సిటీలో నారాయణకు టికెట్ ఇవ్వడంతో జనసైనికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తాను టికెట్ సాధించలేకపోయాయని కార్యకర్తలను సేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్రెడ్డి క్షమాపణలు కోరారు. దీంతో వారంతా పవన్ టికెట్ అమ్మేశాడని కేకలు వేశారు.
టీడీపీ – జనసేన పొత్తు వల్ల అద్భుతాలు జరిగిపోతాయని భావించిన చంద్రబాబు, పవన్కు చుక్కలు కనిపిస్తున్నాయి. కాపుల ఓట్లు కొల్లగొట్టవచ్చని బాబు రాజకీయంగా ఎత్తులు వేశారు. అయితే ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ 40 ఏళ్లు పైబడిన కాపులు పొత్తును తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే బాబు ఎవరినైనా కరివేపాకులా తీసి పారేస్తారని వారికి బాగా తెలుసు. సీట్ల ప్రకటన అనంతరం 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న కాపు యువత కూడా పవన్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. కేవలం 24 సీట్లే తీసుకోవడం.. అందులోనూ ఐదు ప్రకటించి మిగిలినవి ఎక్కడో చెప్పకపోవడం వారికి ఆగ్రహం తెప్పిస్తోంది. చాలాచోట్ల రూ.కోట్లు ఖర్చు చేసిన కాపు నేతలకు సేనాని హ్యాండ్ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియా వేదికగా సేనానిని ఉతికి ఆరేస్తున్నారు. ‘నువ్వు వెన్నుపోటు పొడిచావు. దీనిని జీవితంలో మరిచిపోను’, ‘చంద్రబాబుకు ఊడిగం చేసే బదులు జగన్ను ఒక్క మాట అడిగి ఉంటే 40 నుంచి 50 సీట్లు ఇచ్చి గౌరవించేవాడు’, ‘నువ్వు ఇన్ని తక్కువ సీట్లు తీసుకుంటావని కలలో కూడా ఊహించలేదు. ఇంకోసారి జనసేన పేరు ఎత్తితే చెప్పుతో కొడతానని మా నాన్న అన్నారు’, ‘ఒంటరిగా ఎదిగే సత్తా లేదా.. ఎంత సేపూ చంద్రబాబు.. చంద్రబాబు అంటావు. నువ్వు పక్కా డబ్బు మనిషివి. ఆ 19 సీట్లు కూడా అమ్మేసి ఉంటావు. అందుకే నియోజకవర్గాల పేర్లు చెప్పలేదు’ ఇలా పవన్ను ట్యాగ్ చేసి జనసైనికులు పోస్టులు పెడుతున్నారు. మరోవైపు తెలుగు తమ్ముళ్లు వారిని మరింత రెచ్చగొట్టేలా మీకు 24 సీట్లు ఇవ్వకడమే ఎక్కువంటూ కామెంట్లు పెడుతున్నారు. శనివారం నుంచి సోషల్ మీడియాలో ఇరు పార్టీల కార్యకర్తల నడుమ వార్ నడుస్తోంది.
పవన్.. చంద్రబాబుకు అమ్ముడుబోయాడని, ఆయన మాటలు నమ్మే ప్రసక్తి లేదని కాపు యువత స్పష్టం చేస్తోంది. సేనాని ఇంకా 19 సీట్లలో, చంద్రబాబు 57 సీట్లలో అభ్యర్థులు ఎవరో ప్రకటించాలి. బీజేపీ పొత్తుకు ఓకే చెప్పాక వారికి టికెట్లు ఇస్తే ఇంకెంతమంది నేతలు రగిలిపోతారో.. ఇవన్నీ చూశాక పొత్తు వికంటించే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అలా జరగకపోయినా ఇంత మోసం చేసిన పవన్, బాబుకు కాపులు ఓట్లు వేయరని చెబుతున్నారు.
చంద్రబాబు నాడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచాడు. నేడు సొంత పార్టీ నేతలకు కత్తి దింపాడు. పవన్ కళ్యాణ్ దత్తతండ్రి బాటలోనే నడుస్తూ అటు కాపులకు.. ఇటు జనసేన నేతలు, కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచాడు.