జరిగింది ఒకటైతే దాన్ని మరొకలా చిత్రీకరించే రామోజీ మరోసారి అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసాడు. జర్నలిజం విలువలను తుంగలో తొక్కుతూ అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలిచిన జగన్ ప్రభుత్వంపై అసత్య ప్రచారానికి దిగడం రామోజీ ఓ రాజకీయ పార్టీకి లబ్ది కలిగించేలా రాతలు రాస్తున్నారనడానికి నిదర్శనం. నిజానికి 10.37లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు 930 కోట్లు చెల్లించి జగన్ ప్రభుత్వం ఆదుకుంటే ఆ విషయాన్ని కప్పిపెడుతూ అసలు అగ్రిగోల్డ్ బాధితులను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నట్లు రామోజీ పిచ్చి రాతలు రాసుకొచ్చాడు. అగ్రిగోల్డ్ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర, టీడీపీ నాయకుల విన్యాసాలను పరిశీలిస్తే అగ్రిగోల్డ్ పాపం చంద్రబాబుదే అన్న విషయం ప్రజలకు అర్ధమవుతోంది.
అగ్రిగోల్డ్ పాపం బాబుదే..
అగ్రిగోల్డ్ సంస్థ మొత్తం 8 రాష్ట్రాల్లో 19 లక్షల మంది (19,18,865 )డిపాజిటర్ల నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. మన రాష్ట్రంలో సుమారు 11. 57 లక్షల మంది ( 11,57,497 ) డిపాజిటర్లు అగ్రిగోల్డ్ సంస్థలో రూ.3,941కోట్లు డిపాజిట్ చేశారు. నిజానికి అగ్రిగోల్డ్ కుంభకోణం వెలుగుచూసింది చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే. కుంభకోణం వెలుగుచూసిన బాధితులు లబోదిబోమంటున్న అగ్రిగోల్డ్ బాధితులకు ఒక రూపాయి కూడా విదిలించలేదు నాటి చంద్రబాబు ప్రభుత్వం. కుంభకోణం వెలుగుచూసిన తరువాత టీడీపీ పెద్దల కన్ను విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులపై పడింది. ఆ ఆస్తులను కారు చౌకగా కాజేయాలని టీడీపీ పెద్దలు వ్యూహాలు పన్నడం మొదలుపెట్టారు.
ముఖ్యంగా లోకేష్ వందల కోట్ల విలువైన హాయ్ల్యాండ్ను హస్తగతం చేసుకోవాలని ప్రయత్నాలు చేశారు. 85 ఎకరాల్లో విస్తరించిన హాయ్ల్యాండ్లో దాదాపు 25 ఎకరాల్లో భవనాలు, సామగ్రి ఉన్నాయి. హాయ్ల్యాండ్ను చేజిక్కించుకోవడం కోసం టీడీపీ ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించిన ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నతాధికారి ద్వారా ప్రయత్నాలు చేసారు. అందుకోసం అగ్రిగోల్డ్ సంస్థ యాజమాన్యం, అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్ముకుని వారి వ్యక్తిగత ఖాతాలకు మళ్లించేందుకు టీడీపీ ప్రభుత్వం సహకరించింది. ఇందుకు ప్రతిఫలంగానే అగ్రిగోల్డ్ యాజమాన్యం కోట్లు విలువ చేసే కొన్ని కీలక ఆస్తులను కారు చౌకగా టీడీపీ ముఖ్యులకు విక్రయించింది.
2015 జనవరి 19న అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్మెంట్ జీవో రాక ముందే టీడీపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య, వెంకాయమ్మ పేరుతో రామ్ ఆవాస్ రిసార్ట్స్, హోటల్స్ గ్రూప్ డైరెక్టర్ ఉదయ్ దినకర్ నుంచి 14 ఎకరాలు కొనడం గమనార్హం. ఈ రామ్ ఆవాస్ రిసార్ట్స్, హోటల్స్, అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీవే కావడం విశేషం. 2016 ఏప్రిల్ 30న అగ్రిగోల్డ్ మాజీ వైస్ చైర్మన్ డొప్పా రామ్మోహన్రావు టీడీపీలో చేరడం గమనిస్తే, ఆ సంస్థ యాజమాన్యానికి చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవచ్చు.
అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోని చంద్రబాబు
చంద్రబాబుకు అగ్రిగోల్డ్ సంస్థల యాజమాన్యానికి సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో అగ్రిగోల్డ్ డైరెక్టర్లు, వారి భార్యలు, బంధువులు, బినామీల పేరుతో ఉన్న వందల కోట్ల విలువైన ఆస్తులపై అప్పట్లో సీఐడీ దృష్టి పెట్టలేదు. దానికితోడు రూ. 976 కోట్లను 156 కంపెనీలకు మళ్లించిన విషయాన్నీకూడా పట్టించుకోలేదు. 2019 వరకు అధికారంలో ఉన్నంత వరకూ చంద్రబాబు, టీడీపీ నాయకులు అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను చేజిక్కించుకునేందుకు ప్రయత్నించారు తప్ప, బాధితులకు అండగా నిలవాలని మాత్రం భావించలేదు. బాధితుల గోడునూ పట్టించుకోలేదు. తక్షణం రూ.300 కోట్లు విడుదల చేసి అగ్రిగోల్డ్ బాధితులకు ఎంతో కొంత ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఒక్క పైసా కూడా విదల్చలేదు. అగ్రిగోల్డ్ కుంభకోణం బయటపడినప్పటినుండి బాధితులు మూడున్నరేళ్లపాటు పోరాటం చేసినప్పటికీ టీడీపీ ప్రభుత్వం నయా పైసా సాయం చేయలేదు.
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్న జగన్
ఏపీలో మొత్తం 11. 57 లక్షల మంది ( 11,57,497 ) డిపాజిటర్లు అగ్రిగోల్డ్ సంస్థలో రూ.3,941కోట్లు డిపాజిట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు హామీ ఇచ్చారు. ఆ హామీని నిజం చేస్తూ అగ్రిగోల్డ్ బాధితులను జగన్ ప్రభుత్వం ఆదుకుంది. అగ్రిగోల్డ్ బాధితుల్లో రూ.10వేలు లోపు డిపాజిట్ చేసినవారికి మొదటి విడతలో, రూ.20వేలు లోపు డిపాజిట్ చేసినవారికి రెండో విడతలో వారి డిపాజిట్ మొత్తాలను తిరిగి చెల్లించి, మొత్తం 10.37లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు 930 కోట్లు చెల్లించి సీఎం జగన్ ప్రభుత్వం ఆదుకుంది. మిగిలిన వారికి కూడా డిపాజిట్ మొత్తం చెల్లించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ అగ్రి గోల్డ్ ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంతో జగన్ ప్రభుత్వం ఏలూరు కోర్ట్ లో కేసు వేసి పోరాడుతోంది. చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితులకు చేసిన ద్రోహాన్ని కప్పిపెట్టి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్న జగన్ ప్రభుత్వంపై విష ప్రచారానికి దిగడం రామోజీ దిగజారుడుతనానికి నిదర్శనం.