‘నరేంద్రమోదీ ఎంతటి ప్రమాదకర రాజకీయ నాయకుడో గుర్తించగలిగిన వారు ఆయన పట్ల విధేయత ప్రదర్శిస్తూ రాజకీయం చేసుకోగలుగుతున్నారు. ధిక్కరించిన వారు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి’, ‘బెయిల్ కోసం అప్పుడు అధికారంలో ఉన్న సోనియా గాంధీ వద్దకు కుటుంబసభ్యులను పంపి కాళ్లబేరానికి దిగిన చరిత్ర జగన్ది. దాని ఫలితమే అవినీతి కేసుల్లో అతనిపై విచారణ కూడా జరగలేదు. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్రెడ్డిని అరెస్ట్ చేయలేని పరిస్థితిలో సీబీఐ ఉందంటే పైవాడి ఆశీస్సులు లేకుండా సాధ్యమా..’ తాజా కొత్త పలుకులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి భక్తుడు ఏబీన్ రాధాకృష్ణ మాటలివి.
ప్రపంచంలో ఏమి జరిగినా దానిని జగన్కు ముడిపెట్టడం ఆంధ్రజ్యోతి అలియాస్ చంద్రజ్యోతికి అలవాటు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. దీనిపై మోదీ మోనార్క్ అంటూ ఆర్కే వ్యాసం రాసుకొచ్చారు. అంత వరకు బాగానే ఉంది. కానీ ఇందులో జగన్పై వక్రభాష్యాలు చెబుతూ తన యజమాని అయిన చంద్రబాబును వెనుకేసుకొచ్చారు.
జగన్పై అక్రమాస్తుల కేసు పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందు కోసం తెలుగుదేశంతో కలిసింది నిజం. ఎవరి లేఖల వల్ల యంత్రాంగం వేగంగా కదిలి కట్టుకథలు అల్లి ఆయన్ను 16 నెలలు జైల్లో పెట్టించిందో ప్రజలందరికీ బాగా గుర్తుంది. వైఎస్సార్సీపీ అధినేత కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. కానీ సోనియా వద్దకు కుటుంబసభ్యుల్ని పంపారన్నది పచ్చి అబద్ధం. అదే చేసి ఉంటే ఎందుకు 16 నెలలు జైల్లో మగ్గాల్సి వచ్చింది. ఈ ప్రశ్నకు ఆర్కే సమాధానం చెప్పడు. ఎందుకంటే అతని పని బురద వేయడమే.
ఇక వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారు.. దాని వెనుక ఎవరున్నారు.. ఎవరు కాపాడుతున్నారనే విషయాలు కళ్లముందే కనిపిస్తున్నా ఐదు సంవత్సరాల నుంచి ఎల్లో గ్యాంగ్ వైఎస్సార్సీపీపై నెట్టాలనే కుట్రలు పన్నుతూనే ఉంది. అవినాష్రెడ్డి నిందితుడని ఏ కోర్టు చెప్పలేదు. ఆయనపై అభియోగాలు మాత్రమే ఉన్నాయి. అది కూడా చంద్రబాబు వల్లే. కానీ ఆర్కే మాత్రం నిందితుడని తేల్చేశారు. పైవాడి ఆశీస్సులు ఉండడం వల్లే సీబీఐ అరెస్ట్ చేయలేదని రాసుకొచ్చారు. అంటే ఆయా వ్యవస్థలపై మోదీ ఒత్తిడి తెచ్చి అరెస్ట్ ఆపారని రాధాకృష్ణ ఉద్ధేశమా..
జగన్మోహన్రెడ్డి మోదీని కలిస్తే అది కేసుల మాఫీ కోసం.. వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డి అరెస్ట్ను ఆపడం కోసం.. ఇక చంద్రబాబు కలిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసమని రాయడం చంద్రజ్యోతి ఎప్పటి నుంచో చేస్తున్న పని. సీఎంగా జగన్ ఏనాడూ చీకట్లో హస్తిన పెద్దల్ని కలవలేదు. రహస్య ఒప్పందాలు చేసుకోలేదు. అధికారిక పర్యటనలే చేశారు. అదే బాబు యూపీఏ హయాంలో ఏ విధంగా లాలూచీ పడ్డారో ప్రపంచం మొత్తం చూసింది. అవసరాల కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకునే నైజం నారా వారిది. జగన్ను మోదీ కాపాడుతూ వచ్చారని ఆర్కే చెబుతున్నారు. మరి అలాంటి మోదీని ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ ఎందుకు పాకులాడింది. ఎన్డీఏలో చేరేందుకు అష్టకష్టాలు ఎందుకు పడింది. ఈ ప్రశ్నలకు జవాబుందా ఆర్కే..
మోదీని ధిక్కరించిన వారు జైలుకు వెళ్తున్నారని, ఆయన్ను ప్రసన్నం చేసుకున్న వారు బాగుంటున్నారని చంద్రజ్యోతి రాసింది. ఇప్పుడు బాబు కాళ్లు పట్టుకుని ఎన్డీఏలో చేరింది తనపై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ స్కాం, అమరావతి భూ కుంభకోణం తదితర కేసులను మాఫీ చేసుకోవడానికేనని ఆర్కే చెప్పకనే చెప్పారు. తమ తప్పుల్ని దాచేందుకు ఎదుటి వారిపై లేనిపోని అభాండాలు వేయడం ఎల్లో గ్యాంగ్కు అలవాటే.