తెలుగుదేశం అధినేత, జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆదివారం మూడు గంటలపాటు చర్చించారు. గత నాలుగు రోజులుగా హైదరాబాద్లో మకాం వేసిన నేతలు విడివిడిగా కసరత్తు చేశారు. తాజాగా ఉండవల్లిలో బాబు ఇంట్లో పవన్ కలిసి మాట్లాడగా అభ్యర్థులపై ఏకాభిప్రాయానికి వచ్చారు. సేన అభ్యర్థులు ఉండే చోట టీడీపీ వారికి నచ్చజెప్పాలని నిర్ణయించారు. మంచిరోజు చూసుకుని సీట్లు ప్రకటిస్తారు. ఇది ఎల్లో మీడియా వార్త.. వాస్తవానికి ఇదే జరిగి ఉంటుందా అంటే నమ్మలేం. ఎందుకంటే ఈ పొత్తులో టీడీపీనే కీలకంగా ఉంది. జనసేన డమ్మీ మాత్రమే. సీట్ల విషయంలో ఎల్లో గ్యాంగ్ దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో సేన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మరోవైపు హరిరామాజోగయ్య లేఖలు వదులుతున్నారు. బీజేపీ పొత్తుకు ఇంకా గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఏం చేయాలో బాబు, పచ్చ పత్రికల అధినేతలకు అర్థం కావడం లేదు. దీంతో అధినేతలిద్దరూ సమావేశం పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బయటకు చెబుతోంది ఒకటైతే.. లోపల చర్చించింది వేరే అంశాలపై అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తమ కార్యకర్తలు బాగా గుర్రుగా ఉన్నారని, వారిని శాంతింపజేయాలంటే ఏదో ఒకటి చేయాలని జనసేనాని బాబును కోరినట్లు సమాచారం. దీనికితోడు ఎల్లో మీడియాలో రోజూ సీట్ల ప్రకటనపై పవన్ అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాల్సింది పోయి ఇలా ప్రకటిస్తే సేన కార్యకర్తలు ఎన్నికల సమయంలో అడ్డం తిరిగే అవకాశముందని భయపడుతున్నారు. ఈ అంశాలపైనే ప్రధానంగా చర్చించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ టీడీపీ అధినేతతో రాజీ ధోరణితోనే ఉన్నారని, ఇన్ని సీట్లు కావాలని గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది.