ప్రకృతి విపత్తుల వల్ల పంటలు కోల్పోయిన రైతులకి నష్టపరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నష్ట పరిహారం ప్రకటించడం వల్ల పంటలు కోల్పోయిన రైతులకి కాస్త ఉపశమనం అనే చెప్పొచ్చు. ఈ నిర్ణయం వలన 2023 ఖరీఫ్ సీజన్, 2023-24 రబీ సీజన్లో పంటకు సాగు నీరు అందక, మిచుంగ్ తుఫాన్ వల్ల పంటలను కోల్పోయిన రైతులకి నష్ట పరిహారం అందనుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారాలు గ్రామ సచివాలయాలలోని అగ్రికల్చరల్ అసిస్టెంట్, విఆర్వోల ద్వారా పంటను నష్టపోయిన రైతులను గుర్తించింది. మొత్తం 11.59 లక్షల రైతులకు 1294 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడానికి వ్యవసాయ శాఖ అధికారులు లిస్ట్ రెడీ చేసారు. ఈ నెల 6వ తేదీన తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి డైరెక్ట్ గా రైతుల బ్యాంక్ ఖాతాలోకి సబ్సిడీ మొత్తని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు.
2023 ఖరీఫ్ సీజన్లో పంటకు సాగు నీరు అందక 14,23,995 ఎకరాల్లోని పంటను రైతులు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో ఏడు జిల్లాలోని 103 మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు 6.96 లక్షల మంది రైతులకి 847.22 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
2023-24 రబీ సీజన్లో మిచాంగ్ తుఫాను ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాలలో 6,64,380 ఎకరాల్లోని రైతులు పంటను కోల్పోయినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు 4.61 లక్షల మంది రైతులకు 442.36 కోట్ల పెట్టబడి రాయితీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.