ఆయన ఐటి పితామహుడిగా తనకు తానే చెప్పుకుంటాడు. హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నేనే పెట్టానంటూ బిల్డప్ ఇస్తాడు.. దేశంలో నేనొక్కడినే 40 ఇయర్స్ గా రాజకీయాల్లో ఉన్నానని, 30 ఏళ్ల తర్వాతి భవిష్యత్తు గురించి ఇప్పటినుండే ఆలోచిస్తానని అడిగినవారికీ అడగని వారికీ చెప్పుకు తిరిగే చంద్రబాబు ఏపీలో తన పార్టీ భవిష్యత్తు ఎలా ఉందో తెలియక తల పట్టుకుంటున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశానికి వీస్తున్న వ్యతిరేక పవనాలని పక్కనబెడితే సొంత జిల్లాలో మరింత వ్యతిరేకతను ఎదుర్కొంటూ సైకిల్ తొక్కే అభ్యర్థులు దొరక్క ఇబ్బంది పడుతున్నాడు.
చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ తరపున పోటీ చేసే బలమైన అభ్యర్థులను చంద్రబాబు గుర్తించలేకపోయారు. గుర్తించలేకపోయారు అనడం కంటే టీడీపీపై ఉన్న వ్యతిరేకత వల్ల ఎవరు పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. ఆఖరికి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా ఆయనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. దాంతో చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఒక రహస్య సర్వే నిర్వహించి, సర్వే ఫలితాల్లో తాను ఓటమి పాలయ్యే పరిస్థితి ఉందని తెలుసుకుని ముందు జాగ్రత్తగా కుప్పంతో పాటు మరో నియోజకవర్గం నుండి పోటీకి దిగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. టీడీపీ జనసేన పొత్తుగా పెట్టుకున్నా గెలిచే పరిస్థితి కనిపించకపోవడంతో ఇటు టీడీపీ, అటు జనసేన పార్టీలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి.
గతంలో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఎపి శ్రీలంక అవుతుందని విమర్శించిన చంద్రబాబు తాజాగా జగన్ ని మించిన సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పుకుంటూ తిరగడం చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. అబద్దపు హామీలతో ప్రజలను ఎప్పటికప్పుడు మోసపుచ్చే బాబు తాజాగా కుప్పంలో విమానాశ్రయం నిర్మించి కుప్పం కూరగాయలను విమానాల్లో పంపించి విదేశాల్లో అమ్మిస్తానని హామీ ఇవ్వడం చూసి కుప్పం ప్రజలు నవ్వుకుంటున్నారు. గత 30 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా ఉండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా కుప్పాన్ని పట్టించుకోని చంద్రబాబు తాజాగా విమానాశ్రయం హామీ ఇవ్వడం చూసి విస్మయానికి లోనవుతున్నారు.