నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో సీట్లు ఒకరికి తలిస్తే మరొకరికి వచ్చాయి. తెర వెనుక చాలా కథలు నడిచాయి. అవకాశం దక్కని వారు అభ్యర్థుల కోసం పనిచేయడం ఆపేశారు. దీంతో కేడర్ అంతా తీవ్ర అసంతృప్తిలో ఉంది. ఆ నియోజకవర్గాల్లో శుక్రవారం చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో భాగంగా పర్యటిస్తున్నారు. ఆయన పరిస్థితిని చక్కదిద్దుతారా.. లేక మీ చావు మీరు చావండని గాలికొదిలేస్తారనా అనే చర్చ నడుస్తోంది.
ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు టికెట్ ఆశించారు. ఈయన మహారాష్ట్రలో పెద్ద కాంట్రాక్టర్. టీడీపీ ఆర్థిక స్తంభాల్లో ఒకరు. దీంతో తనకు తప్ప మరొకరికి అవకాశం ఇవ్వరని నేతలకు చెబుతుండేవారు. అయితే అనూహ్యంగా కాకర్ల సురేష్ అనే ఎన్ఆర్ఐ లోకేశ్ను పట్టుకుని ఆయన పాదయాత్రకు భారీగా డబ్బు మూటలిచ్చి టికెట్ కొట్టేశారు. అప్పటి నుంచే పార్టీలో సమస్యలు మొదలయ్యాయి. 2014–19 మధ్య బొల్లినేని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలామంది నేతలు అక్రమంగా సంపాదించారు. వాళ్లంతా కాకర్ల వెంట వెళ్లేందుకు ఇష్టపడలేదు. అభ్యర్థి కూడా రామారావుతో సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారు. కార్యక్రమాలకు బొల్లినేనిని పిలవాలని కేడర్ చెబుతున్నా సురేష్ పట్టించుకోకుండా.. అంతా తాను చూసుకుంటానని చెబుతున్నారు. ఇక వైఎస్సార్సీపీ సస్పెండ్ చేయడంతో టీడీపీలో చేరిన మేకపాటి చంద్రశేఖర్రెడ్డిని అయితే కాకర్ల లెక్కలోకి కూడా తీసుకోవడం లేదు. ఈ కారణంగా ఆయన వర్గం గుర్రగా ఉంది. జరుగుతున్న పరిణామాలను చూసి తెలుగు తమ్ముళ్లు ఆవేదనలో మునిగిపోయారు.
ఇక కావలి విషయానికొస్తే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, జిల్లా మాజీ అధ్యక్షుడు బీద రవిచంద్ర అండదండలతో మాలేపాటి సుబ్బానాయుడు అనే వ్యక్తి ఇన్చార్జిగా ఉండేవారు. అయితే అనూహ్యంగా కావ్య కృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. లోకేశ్ పాదయాత్రకు, పార్టీకి ఫండింగ్ చేశాడు ఈ అక్రమ మైనింగ్ వ్యాపారి. దీంతో సీటును అతనికి ఇచ్చేశారు. అప్పటి నుంచి రవిచంద్ర, సుబ్బానాయుడు వర్గాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి విష్ణువర్ధన్రెడ్డి వైఎస్సార్సీపీ జెండా కప్పుకోవాడానికి రెడీ అయ్యారు. దీంతో కావ్య ఆందోళనలో ఉన్నాడు. అధిష్టానానికి చెప్పినా వారు పట్టించుకోకపోవడంతో ఆ కోపాన్ని రోజూ చూపిస్తున్నాడు. కుర్చీలు పగులగొట్టడం.. పార్టీ కార్యాలయాల తలుపుల్ని తన్నడం.. కార్యకర్తల్ని తిట్టడం లాంటివి చేస్తున్నాడు.
బాబు పర్యటనకు జన సమీకరణ చేసే బాధ్యతను అధిష్టానం కాకర్ల, కావ్యపై పెట్టింది. మాకు నాయకులెవరూ సహకరించడం లేదని పూర్తిగా చేయలేమని వాళ్లు చెప్పేశారు. దీంతో ప్రజాగళం సక్సెస్ అయ్యే అవకాశాలు స్వల్పంగా ఉన్నాయి. పైగా ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్రెడ్డి, కావలిలో రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి బరిలో ఉన్నారు. వీరు బలమైన నేతలు. ఈ ఇద్దరిని ఢీకొట్టడం చాలా కష్టమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి బాబు అందరినీ పిలిచి హితబోధ చేస్తారా.. లేదా అన్ని చోట్ల చేసినట్లే జగన్ను తిట్టేసి వెళ్లిపోతారా..