టీడీపీ నేతల బరితెగింపు బయట పడుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ అంతటా ఎన్నికల కోడ్ ఉన్న విషయం విదితమే. ఎక్కడికక్కడ మద్యం సరఫరాను, డబ్బు కట్టలను ఎన్నికల సంఘం ముమ్మరంగా తనిఖీలు చేస్తూ పట్టుకుంటుంది. సువిధ యాప్ ద్వారా ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సమస్యని అయినా, లేదా అనుమతులు కావాలన్నా తెలుపవచ్చని ఇప్పటికే ఎన్నికల సంఘం పలుమార్లు ప్రస్తావించింది.
అయితే అయిదేళ్ళుగా అధికారానికి దూరంగా ఉండి, ఈ సారి ఎలా అయినా అధికారం లాక్కోవాలనే వేలంవెర్రితో తెలుగు తమ్ముళ్ళు మాత్రం విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 144 సెక్షన్ అమలులో ఉన్నందున, ఎటువంటి రాజకీయ సభలకు, కార్యక్రమాలకు అయినా అనుమతులు తప్పనిసరి.
అయితే పలుచోట్ల అనుమతులు లేకుండానే తెలుగు దేశం వారు సభలను నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఎన్నికల కోడ్ను తుంగలో తొక్కి, నిబంధనలను ఉల్లంఘించడం తో ప్రభుత్వాధికారులు ఆయా సభలను ఆపించాలని ప్రయత్నించగా… అధికారులపై దాడులకు తెగబడ్డారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాలైన ఉదయగిరి, గుడివాడ, కర్నూలు సెవెన్ రోడ్స్, ఎర్రగుంట్ల మొదలయిన పలుచోట్ల తెలుగు దేశం పార్టీ అనుచరులు సభల నిర్వహణ కోసం ఎన్నికల కోడ్ను మరిచారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి లో టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ ఒక పెట్రోలు బంకు ఆవరణలో అనుమతులు లేకుండా సభ నిర్వహించారు. ఇదేమని అడిగిన దుత్తలూరు ఎంపీడీవో కె.సురేష్ బాబు పై దుర్భాషలాడుతూ నానా యాగీ చేసారు.
జంగారెడ్డిగూడెంలో అనుమతులు లేకుండా ఒక ప్రైవేటు భవనంలో టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారని వచ్చిన ఆరోపణలపై అక్కడికి జంగారెడ్డిగూడెం ఎంపీడీవో కేవీ రమణ గుప్త వెళ్ళారు. ఆయన అక్కడికి చేరుకునేలోపే ఫ్లెక్సీలను, పాంప్లెట్లను, తెలుగు దేశం జెండాలను టీడీపీ అనుచరులు మాయం చేసారు.
ఇలా పలుచోట్ల బరితెగించి ప్రవర్తిస్తున్న టీడీపీ నాయకులు, అనుచరులపై ఎన్నికల నోడల్ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు.