యూట్యూబ్ చానల్ లో కాంట్రవర్సీ వీడియోలు చేసుకుంటూ హైలెట్ అయిన సరిపెల్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ వ్యవహార శైలి మొదటి నుండి వివాదాస్పదమే . సమాజం lలో వర్గాల మధ్య, మతాల మధ్య ఉన్న పొరపొచ్చాలనే ఆయుధంగా మార్చుకుని విద్వేషాలు రగిల్చేలా తీవ్ర వాఖ్యలు చేస్తూ ఫాలోయింగ్ పెంచుకున్న రాజేష్ కొద్దిరోజుల తరువాత పంధా మార్చి రాజకీయ నాయకులపై ఆయా పార్టీ కార్యకర్తలపై వివాదాస్పద వాఖ్యలు చేసుకుంటూ వచ్చిన విషయం అందరికి తెలిసిందే . తొలుత చంద్రబాబుని , పవన్ కళ్యాణ్ ని, కాపులని, బ్రాహ్మణులని తీవ్రంగా దుర్భాషలాడిన రాజేష్ కొద్దిరోజుల్లోనే రూటు మార్చి వైసీపీ అధినేత జగన్ పై వ్యక్తిగత దూషణలకి తెగబడ్డాడు.
కేవలం జగన్ పై దూషణలకు దిగి నారా లోకేష్ దృష్టిని ఆకర్షించిన రాజేష్ చివరికి తెలుగుదేశం కండువా కప్పుకుని పూర్తిగా పసుపు కార్యకర్తగా మారిపోయాడు. సమాజంలో హిందూ దేవుళ్లని, బ్రాహ్మణులని , కాపులని తీవ్రంగా దూషిస్తూ విద్వేషాలు రగిల్చిన రాజేష్ లాంటి వారిని పార్టీలో చేర్చుకోవడం కొంతమంది తెలుగు తముళ్లకి నచ్చకపోయినా నాడు లోకేష్ కి ఎదురు చెప్పే సాహసం చేయలేకపోయారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇదే రాజేష్ కి పీ.గన్నవరం టికెట్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేటాయించడంతో ఒక్కసారిగా తెలుగుదేశంలోను పొత్తులో ఉన్న జనసేన బీజేపీల్లోను అలజడి రేగింది.
రాజేష్ మహాసేన లాంటి ఆరాచక శక్తికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని పొత్తులో ఉన్న అన్ని పార్టీల వ్యక్తులతో పాటు సమాజంలో భాగమైన బ్రాహ్మణులు, హిందు సంఘాలు సైతం తీవ్రంగా వ్యతిరేకించడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. అయితే ఈ సారి చంద్రబాబుని బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు రాజేష్ . తనకి టికెట్ ఇవ్వకపోతే నా బలం చూపిస్తానని, నేను పోటీలో ఉండటమే కాకుండా నా మనుషులని మరి కొన్ని నియోజక వర్గాల్లో పోటీలో దింపి ఓట్లు చీల్చి నా బలం చూపిస్తానంటూ పరోక్షంగా చంద్రబాబుని ఉద్దేసించి వీడియో చేసి వైరల్ చేశాడు.
రాజేష్ మహాసేన లాంటి వారిని తొలుత నారాలోకేష్ లాంటి వారు రాజకీయంగా ఎంటర్టైన్ చేయకుండా ఉండి ఉంటే నేడు తెలుగుదేశానికి ఈ పరిస్థితి వచ్చేదా అంటూ తెలుగుతమ్ముళ్ళు ఇప్పుడు ఆవేదన చందుతున్నారు. ఎంతో చరిత్ర కలిగిన పార్టీని ఎవరో ఒక అనామక వ్యక్తి కూడా బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి వచ్చాడంటే దానికి కారణం నారా లోకేష్ మాత్రమే అంటూ మండి పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు మహాసేన రాజేష్ కి భయపడి టికెట్ ఇస్తారా లేక వేరే వారికి కేటాయిస్తారా అనేది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.