అమరావతి.. ఇది చంద్రబాబు మొదలుపెట్టిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు. తాజాగా ‘భ్రమరావతి కథలు’ పేరుతో సీనియర్ జర్నలిస్ట్ అనిల్ గోపరాజు రాసిన పుస్తకాన్ని ఆదివారం విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘అమరావతి – మూడు రాజధానులు’ అంశంపై ప్రత్యేక సదస్సు జరిగింది. ఇందులో వక్తలు బాబు తీరును తూర్పారపట్టారు. అమరావతి దేశంలోనే అతిపెద్ద భూ స్కామ్ అని అభివర్ణించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత బాబుదేనని స్పష్టం చేశారు.
మేధావుల మాటలిలా..
అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు ఈ సదస్సులో మాట్లాడారు. రాజకీయాల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు ఎలా సంపాదించాలో చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. అమరావతి భూ కుంభకోణంలో వంద తరాలకు సరిపడా సంపాదించినట్లు చెప్పారు. బూర్జువా, జమీందారీ వ్యవస్థలను ప్రోత్సహించే ప్రయత్నం చేయగా జగన్ అడ్డుపడ్డారు. అమరావతి రైతుల్ని నిలువునా ముంచిన ఘనత బాబుదని తెలిపారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఆర్ఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని లేకపోవడం చంద్రబాబు పుణ్యమేనన్నారు. సింగపూర్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్.ఈశ్వరన్తో కలిసి బాబు 1,691 ఎకరాల భూమిని ఆ దేశ కంపెనీలను ఇచ్చే ప్రయత్నం చేశారన్నారు. సన్నిహితులతో ముందే భూములు కొనిపించారని విమర్శించారు. వారిలో చాలావరకు బాబు సామాజిక వర్గానికి చెందినే మనుషులే ఉన్నారన్నారు. జనవాహిని సామాజిక సంస్థ అధ్యక్షుడు డీఎస్ఎన్వీ ప్రసాదబాబు మాట్లాడుతూ రాజధాని ప్రాంతాలైన న్యూఢిల్లీ, ఛండీగడ్లో కూడా భూములు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయన్నారు. అమరావతి పేరుతో బాబు సేకరించిన భూమిని ప్రభుత్వపరం చేయాలని డిమాండ్ చేశారు. ఒకే ఇంట్లో తగువులు పెట్టడంలో బాబు దిట్ట అని, ఆయన ముందే భూములు కొనిపించి రైతుల సంపదను కొల్లగొట్టాడని వ్యాఖ్యానించారు. ఇంకా ఈ సదస్సులో ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ గౌతమ్రెడ్డి, నాటా కో–కన్వీనర్ కోడూరు కృష్ణారెడ్డి తదితరులు మాట్లాడారు. బాబు ఓ మాయని సృష్టించగా ఎల్లో మీడియా దానిని నిజమని నమ్మించే ప్రయత్నం చేసిందని వక్తలు అభిప్రాయపడ్డారు. 2019లో అధికారం కోల్పోయాక బాబు ప్రజలపై కక్ష కట్టి అడుగడుగునా అభివృద్ధికి అడ్డుపడ్డాడని, దేశంలో ఏ ప్రభుత్వంపై వేయనన్ని కోర్టు కేసులు వేయించారని గుర్తు చేశారు.
బాబు లీలలు
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి పేరుతో భ్రమలు కల్పించారు. ఆనాటి లీలలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం చేసిన దోపిడీని బయటపెట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ చేయించింది. ఈ సమయంలో తెలుగు తమ్ముళ్ల అవినీతి బట్టబయలైంది. అప్పటి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, పలువురు వ్యాపారవేత్తలు రైతుల పొట్ట æకొట్టి సంపాదించిన విషయం వెలుగు చూసింది. ఐఆర్ఆర్ (ఇన్నర్ రింగ్ రోడ్డు) కుంభకోణం చాలా పెద్దది. భూ సేకరణలో ఇష్టానుసారంగా అప్పటి ప్రభుత్వం వ్యవహరించింది. రైతులకు ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయి. డిజైన్ల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. వివిధ దేశాలకు తిరిగి ప్రభుత్వ ధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేశారు.
అందరూ వ్యతిరేకించినా..
చంద్రబాబు ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టును పట్టించుకోకుండా ఏకపక్షంగా అమరావతిని రాజధానిగా ప్రకటించింది. పంటలు బాగా పండే 33 వేల ఎకరాలను తీసుకుని రియల్ ఎస్టేట్ చేశారు. రాజధాని అక్కడ వద్దని మేధావులు, ప్రజాస్వామ్యవాదులు చెప్పినా బాబు వినలేదు. ఆనాడు వ్యతిరేకత వచ్చినా ధన దాహంతో రెచ్చిపోయారు. ఎల్లో మీడియాలో అనుకూలంగా కథనాలు రాయించారు. అమరావతి పేరుతో జరిగిన దోపిడీ కళ్ల ముందు కనిపిస్తున్నా అంతకు మించిన అద్భుతం లేదన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఎవరికీ ఆమోధయోగ్యం కాని అమరావతి నుంచే పాలన సాగిస్తానని ఇటీవల ప్రకటించారు. నిజానికి ఆయనకు రాజధానిపై ప్రేమ లేదు. దానిని ద్వారా వచ్చే డబ్బేపైనే ఆశంతా..