ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తన అరెస్టు చట్ట విరుద్దం అంటూ కవిత దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత ఐదురోజులుగా ఈడీ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన అరెస్టు అక్రమమంటూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కవితకు వ్యతిరేకంగా ఒక్క బలమైన సాక్ష్యం కూడా లేదని కవిత తరపు న్యాయవాది కపిల్ సిబల్ తన వాదన వినిపించారు. కాగా కేసు మెరిట్స్ లోకి ప్రస్తుతం వెళ్లబోమని చెప్పుకొచ్చిన సుప్రీం కోర్టు పిటిషన్ లో లేవనెత్తిన ఇతర అంశాలపై విచారణకు అంగీకరించింది. ఆరు వారాల్లోగా బదులివ్వాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
చట్టం అందరికీ ఒకటేనని, రాజకీయ నాయకులైనంత మాత్రాన ప్రత్యేక విచారణ ఇక్కడ జరపలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కింది కోర్టులో ట్రయల్ ఎదుర్కోవాలని, బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సుప్రీం కోర్టు సూచించింది. రిట్ పిటిషన్ లో లేవనెత్తి అంశాలను విజయ్ మదన్ లాల్ కేసుతో కలిపి విచారణ జరపుతామని సుప్రీం కోర్టు వెల్లడించింది. దీంతో కవితకు నిరాశే ఎదురైంది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న ఈడీ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్టు చేసారు. ముందు ముందు ఈ కేసు ఎన్ని మలుపులు తిరగనుందో వేచి చూడాలి.