40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబుకు మొదటినుండి ప్రగల్భాలు పలకడమే అలవాటని పలువురు రాజకీయనాయకులు బహిరంగంగానే విమర్శిస్తారు. ఈ విమర్శలకు అనుగుణంగానే చంద్రబాబు బిల్డప్ బాబాయిలా 400 ఏళ్ల చరిత్రగల హైదరాబాద్ ను నేనే ప్రపంచపటంలో పెట్టా, సత్య నాదెళ్లను నేనే సీఈఓ చేశా, బిల్ గేట్స్ కి నేనే సలహాలిచ్చా, సెల్ ఫోన్ నేనే కనిపెట్టా అంటూ అంతా నేనే అన్నీనేనే అని డప్పు కొట్టుకుంటూ ఉంటారు. కాగా చంద్రబాబు ప్రగల్భాలు పలికే విషయాన్ని చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడే ఎన్టీఆర్ టీడీపీ నేత ఒకరు గుర్తించి బహిరంగంగానే విమర్శించారు.
స్వర్గీయ ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు ఎన్టీఆర్ సతీమణి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కాగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రజల వద్దకు పాలన పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని “ప్రజల వద్దకు ప్రగల్భాలు” గా ఎన్టీఆర్ టీడీపీ ప్రచార కార్యదర్శి పి. సాయిబాబు అభివర్ణించడం గమనార్హం. ప్రజల వద్దకు పాలన పేరుతో మూడు విడతలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను దగా చేస్తున్నారని, ఓవైపు కోట్లాది రూపాయలు ఖర్చయ్యే వాగ్దానాలు కురిపిస్తూ, మరోవైపు ఖజానాలో సొమ్ములేదని బిల్లులు చెల్లించవద్దంటూ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశిస్తున్నారని సాయిబాబు అప్పట్లోనే ఎద్దేవా చేశారు. సచివాలయం ఎదుటే గత మూడు నెలలుగా చేస్తున్న ఆందోళనలను పట్టించుకోకుండా మారుమూల ప్రజల వద్దకు వెళ్ళి సమస్యలు తీరుస్తాననటంలో ఆంతర్యం ఏమిటని సాయిబాబు ప్రశ్నించారు. ఖజానాలో సొమ్ము లేదంటూనే ప్రజల వద్దకు పాలన కార్యక్రమం ప్రచారం చేయడానికే చంద్రబాబు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాడని సాయిబాబు దుయ్యబట్టారు.
అప్పటి ఎన్టీఆర్ టీడీపీ ప్రచార కార్యదర్శి పి. సాయిబాబు విమర్శించిన విధంగానే నేటికీ చంద్రబాబు తీరు అలానే ఉండటం గమనార్హం. జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాల అమలు వల్ల రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు అంతకు రెట్టింపు సంక్షేమ పథకాలను అందిస్తానని అబద్దపు హామీలను గుప్పిస్తున్నాడు. కుట్రలతో అవ్వాతాతలకు పెన్షన్ అందకుండా చేసిన చంద్రబాబు, 4000 పెన్షన్ ఇస్తానని, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తా అని వల్లె వేస్తుండడం గమనార్హం. కాలం మారినా చంద్రబాబు తీరు మాత్రం మారలేదు. మారే అవకాశం ఉన్నట్టు కూడా కనిపించడం లేదు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి తిరిగి అధికారం ఇస్తే ఒక్క హామీ కూడా అమలుచేయకుండా మొండిచేయి చూపించడం ఖాయమని పలువురు వ్యాఖ్యానిస్తుండటం విశేషం.