‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అండగా ఉన్నాం. వారి కోసం ఏమైనా చేస్తాం..’ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ పెద్దలు నిత్యం చెప్పే మాటలివి. కానీ ఆయా వర్గాలకు రాజకీయంగా అవకాశాలు ఇచ్చే విషయంలో వారి మాటలు నీటిమూటలే. అగ్రవర్ణాలు, డబ్బు ఉన్న వారికే సీట్లు, పదవులు. అదే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ విషయానికొస్తే సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపుతున్నారు. 2014, 2019 ఎన్నికల సమయంలో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశారు. చట్టసభల్లోకి తీసుకెళ్లారు. 24లోనూ ఇదే ఫాలో అవుతున్నారు. ఇందుకోసం సొంత సామాజికవర్గం, ఇతర అగ్రవర్ణాలకు నచ్చజెపుతున్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని సభల్లో చెప్పడమే కాకుండా పదవులిచ్చి తన పక్కన స్థానం కల్పిస్తున్నారు.
నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా బీసీ అయిన డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్కు జగన్ రెండుసార్లు అవకాశం కల్పించారు. ఇప్పుడు ఏకంగా వైఎస్సార్సీపీ నరసారావుపేట పార్లమెంట్ ఇన్చార్జిని చేశారు. దీంతో అగ్రవర్ణ వ్యక్తి, ధనవంతుడైన లావు శ్రీకృష్ణదేవరాయులు అలకబూనారు. చంద్రబాబు గేలం వేస్తే చిక్కేశారు. అనిల్ స్థానంలో నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ముస్లిం వర్గానికి చెందిన సామాన్యుడు ఖలీల్ అహ్మద్ను నియమించారు. ఈయన్ను కార్పొరేటర్ను చేసి డిప్యూటీ మేయర్గా అందలమెక్కించిన ఘనత వైఎస్సార్సీపీదే.
వైఎస్సార్సీపీ తరఫున నెల్లూరు ఎంపీ సీటును వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఆశించారు. పార్టీ అధిష్టానం కూడా ఓకే చెప్పింది. అయితే ఆయన భార్య ప్రశాంతిరెడ్డికి సిటీలో అవకాశం ఇవ్వాలని అడిగారు. ఇక్కడ వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్న జగన్ సొంత సామాజిక వర్గం వ్యక్తికి నో చెప్పారు. తన మాట కాదని ముస్లింను సమన్వయకర్తగా నియమించడాన్ని వేమిరెడ్డి ఓర్చుకోలేకపోయారు. పెత్తందారి పోకడలను బయటపెట్టారు. తనకు రాజ్యసభ సభ్యత్వం, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్ష పదవి, భార్యకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యురాలి పదవి.. ఇన్ని చేస్తే మర్చిపోయి మరో పెత్తందారి అయిన చంద్రబాబుతో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
ముస్లింకు బాబు వెన్నుపోటు
ముస్లిం కోసం జగన్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డిని దూరం పెడితే.. చంద్రబాబు ఆయన్ను తన వెంట రావాలని అడిగారు. నెల్లూరు ఎంపీ సీటుతోపాటు బోనస్గా భార్యకు ఎమ్మెల్యే సీటు ఇస్తానని ఆఫర్ చేశారు. వేమిరెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ముస్లిం నాయకుడు అబ్దుల్ అజీజ్కు వెన్నుపోటు పొడుస్తున్నారు. అజీజ్ను గతంలో నెల్లూరు మేయర్ను ఘనత వైఎస్సార్సీపీది. అయితే ఆయన పొంగూరు నారాయణ ఒత్తిళ్లతో టీడీపీలో చేరారు. 2019లో రూరల్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా అదే స్థానంలో తిరుగుతూ 2024లో బరిలో ఉండాలని ప్రయత్నిస్తున్నారు. కానీ నారా వారు కరివేపాకులా తీసేశారు. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని ఇన్చార్జి చేసి ముస్లిం అయిన అజీజ్ను దూరం పెట్టారు. ఎంతో కష్టపడిన ఈయన కన్నీరుమున్నీరైనా పట్టించుకోలేదు. కొంతకాలానికి నెల్లూరు ఎంపీ సీట్ అడిగారు. చంద్రబాబు ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ధనవంతుడైన వేమిరెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు అజీజ్ను పక్కన పెడుతున్నారు. సామాజిక న్యాయానికి పాతర వేశారు.
బాబు ఏనాడూ వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదు. టికెట్ల విషయంలో ధనవంతులు, అగ్రవర్ణాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుతం కూడా అంతే. నెల్లూరు సిటీలో మాజీ మంత్రి నారాయణ, రూరల్లో శ్రీధర్రెడ్డి, సర్వేపల్లిలో సోమిరెడ్డి, కావలిలో కావ్య కృష్ణారెడ్డి, ఉదయగిరిలో బొల్లినేని రామారావు, ఆత్మకూరులో ఆనం రామనారాయణరెడ్డి తదితరులకు టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి యాడ్ అవుతున్నారు. బీసీ అయిన బీద రవిచంద్ర చాలాకాలంగా పార్టీని నమ్ముకుని ఉన్నారు. ఆయనకు ఏనాడూ అవకాశం ఇవ్వలేదు. ఉదయగిరిలో చెంచలబాబు యాదవ్ సీటు అడుగుతున్నారు. ఆయన్ను ప్రోత్సహించడం లేదు. అదే జగన్ విషయానికొస్తే ఓసీలకు బదులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీట్లు కేటాయిస్తూ ఆయా వర్గాలకు రాజ్యాధికారం కలను సాకారం చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నారు.