వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ధీరత్వానికి మారుపేరు. ఒక బ్రాండ్. దేశాన్ని శాసిస్తున్న సోనియా గాంధీనే ఎదిరించాడు. అతని పనైపోయింది అన్నారు. రాష్ట్రంలో కాకలు తీరిన రాజకీయ ఉద్ధండుల నడుమ నిలబడలేడని ప్రచారం చేశారు. అందరూ కలిసి ఒక యువ గొంతును అధఃపాతాళానికి తొక్కాలని చూశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా జగన్ బెదరలేదు. ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారు. తన లక్ష్యాన్ని చేరుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 13 సంవత్సరాలు పూర్తయ్యాయి. 14వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరిగాయి.
వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడిగా రాజకీయాల్లో వచ్చిన జగన్.. తనదైన వ్యూహాలతో దేశంలోనే ప్రభావంతమైన శక్తిగా మారారు. చాలా మంది ముఖ్యమంత్రుల కొడుకులకు రాజకీయాలు అచ్చిరాలేదు. కానీ జగన్ మాత్రం రాటుదేలి వైఎస్సార్సీపీ పతాకాన్ని వాడవాడలా ఎగురవేశారు.
ఓదార్పు యాత్రను ఆపేయాలని నాడు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. కానీ తండ్రి వైఎస్సార్ మరణంతో ఆగిన గుండెలను చూసి జగన్ మనసు తరుక్కుపోయింది. సోనియా గాంధీ ఆదేశాలను లెక్క చేయకుండా ఓదార్పు యాత్ర చేశారు. 2011 మార్చి 11వ తేదీన వైఎస్సార్సీపీని ప్రకటించారు. ఆ సమయంలో ఆయన వెంట తల్లి విజయమ్మ మాత్రమే ఉన్నారు. కడప ఎంపీగా జగన్, పులివెందుల ఎమ్మెల్యేగా విజయమ్మ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయ్యాయి. వైఎస్సార్సీపీని ఆదిలోనే తుంచేందుకు జగన్ అక్రమాస్తులు కూడగట్టాడని హైకోర్టులో పిటిషన్లు వేయించారు. సీబీఐ విచారణ చేయించారు. కానీ జగన్ భయపడలేదు. ధైర్యంగా విచారణను ఎదుర్కొన్నారు.
19 మంది ఎమ్మెల్యేలు, నెల్లూరు ఎంపీ మేకపాటి పదవులకు రాజీనామా చేశారు. ఆ సందర్భంగా జరిగిన ఉప ఎన్నికల్లో 17 అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానంలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. జగన్ను ఎదగనీయకుండా చేసేందుకు జైల్లో వేయించారు. 16 నెలలు అక్రమంగా నిర్బంధించారు. ఆయన 2013 సెప్టెంబర్ 24వ తేదీన బెయిల్పై బయటికి వచ్చారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ దీక్షలు చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ – జనసేన – బీజేపీ కలిసి పోటీ చేయగా జగన్ ఒంటరిగా బరిలోకి దిగారు. 67 అసెంబ్లీ, ఏడు ఎంపీ స్థానాలు గెలిచారు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. 2017లో ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. 14 నెలలపాటు 3,648 కిలోమీటర్లు నడిచారు. 2019 ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లతో ఘన విజయం సాధించారు. 151 శాసనసభ, 22 ఎంపీ సీట్లు గెలిచారు.
ఈ ఐదేళ్ల పాలనలో ఎన్నో మంచి పనులు జగన్ చేశారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచారు. అభివృద్ధి పనులు చేశారు. దీంతో వైఎస్సార్సీపీపై జనానికి ఎంతో నమ్మకం ఏర్పడింది. 2024 ఎన్నికల్లోనూ జగన్ నేతృత్వంలో ఈ పార్టీ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ప్రతిపక్షాలు 2014లోలా కూటమి కట్టి వస్తున్నా వైఎస్సార్సీపీ అధినేత ప్రజలనే నమ్ముకున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేద్దామని కుట్రలు పన్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఒక ప్రాంతీయ పార్టీ ఈ స్థాయిలో చరిత్ర సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు. టీడీపీ చంద్రబాబుది కాదు. ఎన్టీఆర్ నుంచి లాక్కొంది. జనసేన పెట్టినా పవన్ కళ్యాణ్ సాధించేందేమీ లేదు. కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోయాడు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినా ఎక్కువ కాలం నడపలేక కాంగ్రెస్లో విలీనం చేసేశారు. దేశంలో కావొచ్చు, ఉమ్మడి ఏపీలో కావొచ్చు.. చాలా పార్టీలు పుట్టుకొచ్చినా కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ జగన్ తన పార్టీని నిలబెట్టారు. తిరుగులేని శక్తిగా మారారు. మాట ఇస్తే తప్పని నేతగా పేరుగాంచారు. విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారు. తన జెండాను పేదలకు అండగా మార్చారు. మరికొన్ని దశాబ్దాలపాటు ఆయన దరిదాపుల్లోకి కూడా ఎవరూ చేరలేరు.