నిరాదరణకు గురై, అధ్వానంగా తయారైన చెరువులను అభివృద్ధి చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో వందలాది ఎకరాలకు సాగునీరు, ప్రజల తాగునీటి అవసరాలను తీర్చిన చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. దీంతో ఉపాధి హామీ నిధులతో వాటి అభివృద్ధికి జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
అమృత్ సరోవర్ యోజన పేరిట కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంది. దీంతో నాడు అస్తవ్యస్తంగా, పిచ్చిమొక్కలతో రూపు కోల్పోయిన చెరువులు నేడు కొత్త రూపును సంతరించుకున్నాయి. కొన్నేళ్లుగా నిరాదరణకు గురై, అధ్వానంగా తయారైన చెరువులు సైతం బాగుపడ్డాయి.
చెరువుల్లో పూడికలు తీసి, గట్లను పటిష్టపరిచి, నీటిని నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలమట్టం పెంచాలనేది ఉద్దేశం. తద్వారా పశువులకు తాగునీటి, ప్రజలకు తాగు, సాగునీటి కొరతను నివారించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కనీసం ఎకరా ఆపై విస్తీర్ణం ఉన్న చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. కొన్నేళ్లుగా భారీగా పూడికలు పేరుకుపోయిన చెరువులను గుర్తించారు. విస్తీర్ణాన్ని బట్టి ప్రతి చెరువుకూ రూ.4 లక్షల నుంచి రూ.17.50 లక్షల వరకూ ఉపాధి హామీ పథకం నిధులు కేటాయించారు. ఒక్కో చెరువులో కనీసం 10,000 క్యూబిక్ మీటర్ల మేర నీటిని నిల్వ ఉంచేలా ప్రణాళికలు రూపొందించారు. ఆ మేరకు ఉపాధి కూలీలతో యుద్ధప్రాతిపదికన చెరువు పునరుద్ధరణ, పూడికతీత పనులు పూర్తి చేశారు. పిచ్చి మొక్కలు తొలగించి, వాటి స్థానంలో పూల మొక్కలు, అరటి, కొబ్బరి మొక్కలు పెంచడం ద్వారా ఆహ్లాదకర వాతావరణం తీసుకొచ్చారు.
ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లాలో 67 గ్రామ పంచాయతీల్లోని 75 చెరువులను ఎంపిక చేశారు. మొత్తం 75 చెరువుల అభివృద్ధితో 306.43 ఎకరాల భూములు అదనంగా వినియోగంలోకి వచ్చాయి. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పక్కాగా నిర్వహించడంతో చెరువుల సుందరీకరణ జరగడమే కాకుండా ఉపాధి కూలీలకు బాగా పనులు లభించాయి..