2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రకటనల్లో మునిగి తేలుతున్నాయి, ఈ విషయంలో అధికార వైసీపీ మిగతా అన్ని పార్టీల కన్నా ముందుందని చెప్పొచ్చు. దాదాపు రెండు నెలలుగా అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు చేస్తూ ఎప్పటికప్పుడు విడతల వారీగా జాబితాలు విడుదల చేసింది.
ఆయా నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఉన్న సమస్యలు ఒకొకటి పరిష్కారం చేసుకుంటూ నియోజక వర్గాలలో సమన్వయకర్తలను నియమించుకుంటూ ముందుకు వెళ్తోన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా 11వ జాబితాను విడుదల చేసింది. కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తగా బీవై. రామయ్య, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తగా రాపాక వరప్రసాద్, రాజోలు అసెంబ్లీ సమన్వయకర్తగా గొల్లపల్లి సూర్యారావును నియమిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు విపక్షాలు టీడీపీ, జనసేన ఒక విడత లిస్టు విడుదల చేయగా అందులో 94 స్థానాలకు టీడీపీ అభ్యర్థులని ప్రకటించింది . జనసేనకు కేటాయించిన 24 స్థానాల్లో అయిదు స్థానాలకి అభ్యర్థులని ప్రకటించిన పవన్ మిగతా 19 స్థానాలు ఎక్కడా, అభ్యర్థులు ఎవరు అనేది రెండు రోజుల్లో చెబుతానన్నారు కానీ ఇంతవరకూ వెల్లడించలేదు. బిజెపితో పొత్తు నిర్ణయం అయ్యి వాళ్లకి కేటాయించిన స్థానాలు పోను మిగిలిన వాటిలో టీడీపీ ఎంచుకోగా చివరికి మిగిలిన స్థానాలు జనసేనకు కేటాయించవచ్చని అయితే ఆ స్థానాలు జనసేనకు పట్టు ఉన్నవి కాకుండా టీడీపీ ఓటమి చెందే స్థానాలు తమకి వదిలేస్తారని జనసైనికులు అనుమానపడుతున్నారు.