క్యాన్సర్ ప్రాణాంతకమైంది. దీనికి చికిత్స చేయించుకోవడం అత్యంత ఖరీదుతో కూడికున్న వ్యవహారం. చాలామంది పేదలు ఈ వ్యాధి బారిన పడి కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేక చనిపోయిన సందర్భాలున్నాయి. అలాగే పూర్తిస్థాయిలో డబ్బు పెట్టలేక అప్పులపాలై వేదనతో లోకాన్ని విడిచిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచింది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ను చేర్చి రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తోంది.
వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆరోగ్యశ్రీ పథకంలో సమూల మార్పులు తెచ్చారు. ప్రొసీజర్లను 3,257కి పెంచారు. క్యాన్సర్కు సంబంధించిన ప్రొసీజర్లు 400కి పెరిగాయి. దీనికితోడు వైద్య ఖర్చులకు పరిమితి విధించకుండా అన్ని రకాలకు ఉచితంగా చికిత్స చేయిస్తున్నారు. లుకేమియా బాధితులకు చేసే రూ.10 లక్షలు, ఆపై ఖర్చయ్యే బోన్మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ను సైతం ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేస్తున్నారు. జగనన్న పుణ్యాన 2019 సంవత్సరం నుంచి 3,03,899 మంది క్యాన్సర్ బాధితులు 10,43,556 ప్రొసీజర్లలో చికిత్స పొందారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,165.74 కోట్లు ఖర్చు చేసింది.
అదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కింద కేవలం 1,059 ప్రొసీజర్లు ఉండేవి. 200 లోపు క్యాన్సర్ ప్రొసీజర్లు మాత్రమే ఉన్నాయి. అతికష్టం మీద బాధితుల చికిత్సకు కేవలం రూ.751 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ మొత్తం ఇవ్వడంలోనూ అనేక అడ్డంకులు సృష్టించారు.
ఎన్నో వ్యాధులకు..
దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజలకు వరం. ఇది లేకపోతే చాలామంది అనారోగ్యం కారణంగా చనిపోయేవారు. నేడు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం చేయించుకుని జీవిస్తున్నారంటే అందుకు ముఖ్య కారణం వైఎస్సార్. ఆయన మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేయగా జగన్ మాత్రం మార్పులు తెచ్చి పేదలకు మరింత మంచి చేస్తున్నారు. రూ.5 లక్షలున్న పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు. కొత్త కార్డులు పంపిణీ చేస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కోసం ప్రభుత్వం రూ.12,150 కోట్లు ఖర్చు చేసింది. దీనిని బట్టి జగన్ చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చు. చికిత్స అనంతరం విశ్రాంతి కాలంలో రోగులకు అండగా ఉండేందుకు ఆసరా పథకం ద్వారా రూ.1,366 కోట్లు అందింది. దీని లబ్ధిదారుల సంఖ్య 22.88 లక్షలు. పేదలకు లబ్ధి చేకూర్చే ఈ స్కీమ్ విషయంలో జగన్మోహన్రెడ్డి ఏనాడూ నిర్లక్ష్యం వహించలేదు. డాక్టర్ కొడుకు అయిన ఆయనకు రోగుల సమస్యలు తెలుసు కాబట్టి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వ్యాధులతో బాధపడేవారు చికిత్స చేయించుకునేందుకు ఇబ్బంది పడదకూడదని సొంత బిడ్డలా సాయం అందించారు.