ఇటీవల అమిత్ షాను కలిసి చర్చించిన తర్వాత చంద్రబాబు సైలెంట్ అయిపోయారు. చంద్రబాబు మౌనం వెనకున్న అంతరార్థం ఏంటి? పొత్తుల విషయంలో ఏమీ చేయలేని నిస్సహాయతలో బాబు కూరుకుపోయారా? అపర చాణక్యుడిగా 40 ఇయర్స్ ఇండస్ట్రీగా అనుకూల మీడియాలో బాకా ఊదించుకునే బాబు ఎందుకు పెదవి విప్పడం లేదు. ఆయన మౌనం వెనక దాగిన రహస్యం ఏంటి.. ? ఇప్పుడు రాజకీయవర్గాల్లో తలెత్తుతున్న సగటు ప్రశ్న ఇది.
2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత ఏపీలో జరిగిన అన్ని ఎన్నికల్లో ఓడిపోవడంతో తెలుగుదేశం పార్టీ ఉనికికే ప్రశ్నార్ధకంగా మారిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకానొక సందర్భంలో టీడీపీ కీలక నేతగా పేరొందిన అచ్చెన్నాయుడు ‘పార్టీ లేదు బొ* లేదు అనడం’ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. టీడీపీ భవిష్యత్తు గురించి నమ్మకం లేక అచ్చెన్నాయుడు ఆ మాటలు అని ఉంటారనే వాదన కూడా తెరపైకి వచ్చింది. కాలం గడిచే కొద్దీ అనుకూల మీడియాలో లేని గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారాన్ని చంద్రబాబు ఊదరగొట్టించి వదిలిపెట్టాడు. ఒంటరిగా ఎన్నికలకు వెళితే తన పార్టీ పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయే అవకాశం ఉందని భయంతో పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్నాడు. స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు రిమాండ్ లో ఉన్న సమయంలో మూడో ప్రత్యమ్నాయంగా ఎదిగే ప్రయత్నం చేయకుండా చంద్రబాబును కలిసిన వెంటనే తెలుగుదేశం జనసేన కలిసే పోటీ చేస్తాయని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కేవలం జనసేనతో పొత్తుతో ఉంటే గెలుపుకు అవకాశం లేదని రాష్ట్రంలో 2% ఓటింగ్ కూడా లేని బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాను బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నానంటూ బీజేపీ అధినాయకత్వానికి సందేశాలను పంపుతూనే ఉన్నారు. ఎట్టకేలకు బాబు ప్రయత్నాలు ఫలించి అమిత్ షా చర్చలకు ఆహ్వానించారు. ఇంతవరకూ సవ్యంగా జరిగినట్లు అనిపించినా ఆ తర్వాత చంద్రబాబు పొలిటికల్ గా సైలెంట్ అయిపోవడం టీడీపీ శ్రేణులను అయోమయంలో పడేసింది. సంక్రాంతి అనంతరం జనసేన టీడీపీ మొదటి లిస్ట్ విడుదల అంటూ ప్రచారం జరిగినా సంక్రాంతి గడిచి నెల అవుతున్నా ఇంకా మొదటి లిస్ట్ రెడీ చేయకపోవడం చంద్రబాబు నిస్సహాయస్థితికి నిదర్శనంగా చెప్పొచ్చు.
అభ్యర్థులను ఖరారు చేసే క్రమంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల మధ్య పొరపొచ్చాలు కూడా చోటు చేసుకోవడం వల్ల కూడా జనసేన టీడీపీ పొత్తు చివరివరకూ ఉంటుందా అనే సందేహాలు ఏర్పడుతున్నాయి. తనని సంప్రదించకుండా ఇద్దరు అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేయడంతో కినుక వహించిన పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉందని హితవు పలుకుతూ తాను కూడా జనసేన తరపున ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేశారు. దానికితోడు 2019 ఎన్నికల సందర్భంగా కొందరు టీడీపీ సీనియర్ నాయకుల అవినీతిపై మాట్లాడానని, అంతేకాకుండా ఆ నాయకులు తనపై దూషణలకు పాల్పడినందున ఆ సీనియర్ నాయకులకు సీట్లు ఇవ్వకూడదనే కండిషన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు పెట్టాడనే గుసగుసలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.
అమిత్ షాతో చర్చలకు ముందు బీజేపీతో పొత్తు ఆల్మోస్ట్ సెట్ అయిందని ఫార్మాలిటీ కోసమే చర్చలు జరుగుతున్నాయని చంద్రబాబు అనుకూల మీడియాలో ఊదరగొట్టారు. చర్చల అనంతరం పవన్ కళ్యాణ్ తో కలిసి చర్చించి అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారనే ప్రచారం నడిచింది. కానీ అమిత్ షాతో చర్చల అనంతరం పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలవలేదు. దీంతో చర్చల్లో ఏం జరిగిందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. బీజేపీ 4-2-1 సీట్ల క్రమాన్ని ప్రతిపాదించిందని ఈ ఫార్మాట్ లో సీట్లను కేటాయిస్తే కేవలం 100 సీట్లలో మాత్రమే టీడీపీ పోటీకి దిగాల్సిన పరిస్థితి తలెత్తుతుందని తద్వారా టీడీపీలో సీట్లను ఆశించే ఆశావహులకు సమాధానం చెప్పే పరిస్థితి ఉండదని బాబు అంతర్మథనానికి లోనవుతున్నారనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఎంతవరకూ ప్రత్యర్థి పార్టీ ఖాళీ అవుతుందనే పుకార్లను తన అనుకూల మీడియాలో చెప్పిస్తూ కాలం గడుపుతున్న చంద్రబాబు, టీడీపీ తరపున అభ్యర్థులను ప్రకటిస్తే ఎంతమంది పార్టీకి ఎదురుతిరుగుతారో ఊహించడం కష్టంగా మారింది.
ఎన్నికలకు కేవలం రెండు నెలల సమయమే ఉన్న తరుణంలో ఇంకా అభ్యర్థులను ఖరారు చేయకపోవడం టీడీపీ తరపున సీట్లు ఆశిస్తున్న ఆశావహులకు తలనొప్పిగా మారింది. సీట్లను ప్రకటిస్తే తమ నియోజకవర్గ శ్రేణులను సమన్వయం చేసుకోవచ్చనే ఆలోచనలో అభ్యర్థులు ఉంటే సీట్ ఎవరికీ ఇవ్వాలో పొత్తులు ఎవరితో పెట్టుకోవాలో తెలియని సంకట పరిస్థితి బాబుకు ఏర్పడింది. దీనికితోడు టీడీపీ ఏర్పడిన ఇన్నేళ్ళలో తొలిసారి రాజ్యసభ సభ్యత్వానికి ఒక్క అభ్యర్థిని కూడా పోటీకి నిలబెట్టలేని పరిస్థితి తలెత్తింది. అనుకూల మీడియాలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న బాబు ఇప్పటికైనా మౌనం వీడి అభ్యర్థులను, పొత్తులను ఖరారు చేస్తారా లేక ఇలానే ఎన్నికల వరకూ కాలం గడిపేస్తారా అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరుకుతుందేమో వేచి చూడాలి.