డబ్బు ఉంటే చాలు.. రాజకీయాలను శాసించవచ్చని చాలామంది భావిస్తుంటారు. కానీ చాలా వరకు నిజం కాదు. సామాన్యులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులైన సందర్భాలున్నాయి. ప్రజలకు సాయం చేసే గుణం ఉండాలి. వారి మనసులో చోటు సంపాదించాలి. అప్పుడే ఎన్నికల్లో గెలుపు వస్తుంది. కానీ నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అలియాస్ వీపీఆర్ నా దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయని వీర్రవీగుతూ ఏమైనా చేయగలనని అనుకుంటున్నారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో ఆయన ఆటలు సాగకపోవచ్చని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది.
వైఎస్ జగన్మోహన్రెడ్డి వీపీఆర్కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. పెద్ద మనిషని గౌరవించి రాజ్యసభ సభ్యుడిని చేశారు. ఆయనకు ప్రజా బలం లేకపోయినా జగన్ అండతో నాయకుడిగా చెలమణి అయ్యారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వేమిరెడ్డి స్వరం మెల్లగా మారుతూ వచ్చింది. తన వల్లే ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థానాల్లో పార్టీ గెలిచిందని ప్రచారం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే సక్రమంగా పనిచేయలేదనే విమర్శలున్నాయి. డబ్బుంటే చాలు ఏం చేసినా అడిగే వారు లేరని అప్పగించిన బాధ్యతలను గాలికొదిలేశారు. జగన్ ఆయన వయసుకి మర్యాద ఇచ్చి అన్ని సహిస్తూ వచ్చారు. ప్రశాంతిరెడ్డి తిరుమల, తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా అవకాశం పొందారు. 2024లో వేమిరెడ్డి నెల్లూరు పార్లమెంట్ సీటు అడిగారు. కాదనలేదు. కానీ తన భార్యకు సిటీ టికెట్ ఇవ్వాలన్నారు. అయితే ఆ స్థానం సామాన్య ముస్లిం సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఇస్తున్నామని చెప్పగా వీపీఆర్లోని పెత్తందారీ బయటికి వచ్చాడు. రాష్ట్రంలో అత్యంత ధనికుడి మాటనే కాదంటారా అని అలకబూనారు. కానీ ఆయనది వాపు కాదని బలుపు అని తేలేందుకు ఎంతో కాలం పట్టలేదు.
బీజేపీలో చేరేందుకు వీపీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. రాజ్యసభ, కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఎంతైనా ఖర్చు చేస్తానని ఈ మైనింగ్ వ్యాపారవేత్త ఇచ్చిన ఆఫర్ను కమలం పెద్దలు తిరస్కరించారు. ఇక మనుగడ కోసం చంద్రబాబు చెంతనే చేరాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతల రాయభారంతో బాబు ఒప్పుకొన్నారు. ఇక వీపీఆర్ డబ్బుతో పదవులు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నారు. నెల్లూరు ఎంపీ సీటు దక్కించుకున్నారు. కోవూరులో ఇన్చార్జి దినేష్రెడ్డిను కాదని తన భార్యకు టికెట్ ఇప్పించుకున్నారు. రేపు తాను గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించాలని నారా వారికి ప్రతిపాదన పెట్టారు. అందుకోసం ఎన్నికల ఖర్చులో మెజార్టీ భాగం ఇస్తానని చెప్పారు. దీంతో ఆయన కూడా ఒప్పుకొన్నారు.
వీపీఆర్ వెంట జిల్లాలోని వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు ఎవరూ వెళ్లలేదు. ఎమ్మెల్యేలు ముఖం చాటేశారు. చోటా నేతలు చాలామందికి డబ్బు ఆశ చూపినా.. జగనన్న సైనికులు తిరస్కరించారు. జిల్లాలో డబ్బుతో ఓట్లు కొంటానని ఎప్పుడూ వేమిరెడ్డి చెబుతుంటారు. కానీ అధిక ప్రాధాన్యం ఇచ్చిన పార్టీని వీడడంతో జనమంతా ఆగ్రహంగా ఉన్నారు. ఆయనకు గుణపాఠం చెప్పి డబ్బు రాజకీయాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు.