రాష్ట్రంలోని విశాఖపట్నం పోర్టు ఎగుమతులు, దిగుమతుల్లో రికార్డులు సృష్టిస్తోంది. తన పాత రికార్డులను తనే తిరగరాస్తోంది. దీనికి సంబంధించి పోర్టు అథారిటీ వివరాలు వెల్లడించింది. గతేడాది డిసెం బర్ 23వ తేదీన 8,879 టన్నుల కాల్సినెడ్ అల్యూమినాను 699 గ్యాంగ్ హుక్ అవుట్ పుట్ సామర్థ్యంతో ఈక్యూ 6 బెర్త్లో ఎంవీ ఫెయిత్ అనే నౌకలోకి ఎక్కించి రికార్డును నెలకొల్పారు. తాజాగా ఈనెల 23వ తేదీన 10,125 టన్నుల కాల్సినెడ్ అల్యూమినాను 844 టన్నుల గ్యాంగ్ హుక్ అవుట్ పుట్ సామర్థ్యంతో ఈక్యూ 4 బెర్త్లో ఎంవీ ఎవరెస్ట్ కెషిప్లో ఎక్కించారు. ఉత్కల్ అల్యుమినా ఇంటర్నేషనల్ సంస్థ ఈ షిప్ ద్వారా సరుకును ఎగుమతి చేసింది. దీంతో పాత రికార్డును తిరగరాసినట్లయిందని పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు తెలిపారు. దీనికి శ్రావణ్ షిప్పింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ స్టివెడోర్స్గా వ్యవహరించగా ఇంటర్ ఓషన్ షిప్పింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్టీమర్ ఏజెంట్లుగా వ్యవహించింది. ఇక ఈనెల 21న పోర్టు మరో రికార్డును నెలకొల్పింది. దేశ్ విఖోర్ అనే భారీ ఇంపోర్ట్ క్రూడ్ ట్యాంకర్ను హ్యాండిల్ చేసింది. దీని పొడవు 333 మీటర్లు. ఈ నౌక నుంచి హెచ్సీఎల్ కోసం రికార్డు స్థాయిలో 2,81,142,257 టన్నుల క్రూడాయిల్ను దిగుమతి చేసుకున్నారు. గతంలో ఎలండ్రా డెనాలి అనే 329.99 మీటర్ల వెడల్పు గల నౌక నుంచి 2,80,800 టన్నుల క్రూడాయిల్ను దిగుమతి చేశారు.
బీచ్ నిర్వహణ పనులకు శ్రీకారం
విశాఖ ఆర్కే బీచ్ ప్రాంతంలో బీచ్ నిర్వహణ, షోర్ పంపింగ్ పనులను అంగముత్తు గురువారం ప్రారంభించారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఈ పనులను డ్రైజ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మూడేళ్లలో రూ.57.26 కోట్లతో 6.3 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వుతారు. ఈ పనులను డీసీఐ నెల రోజులపాటు కొనసాగిస్తుందన్నారు. విశాఖ సాగర తీరం సహజత్వాన్ని కాపాడేందుకు ముఖ్యంగా ఆర్కే బీచ్, సబ్ మెరైన్ ప్రాంతాలను కవర్ చేస్తూ పోర్టు నిధులతో కొన్నేళ్లుగా నిర్వహణ పనులను చేపట్టినట్లు వెల్లడించారు.
తీరం వరం
మన రాష్ట్రానికి బలమే తీర ప్రాంతం. పోర్టుల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు జగన్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రామాయపట్నం పోర్టును నిర్మిస్తోంది. ఇది ప్రారంభానికి సిద్ధంగా ఉంది. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు అతిపెద్ద విశాఖ పోర్టు అభివృద్ధిపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ పోర్టుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. రూ.655 కోట్లతో నాలుగు బెర్త్ల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సరుకుల రవాణాలో ఈ పోర్టు ఎంతో వృద్ధి సాధించింది.