నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ అన్ని స్థానాల్లో విజయం సాధించేలా ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి అడుగులు వేస్తున్నారు. అసంతృప్తులు, ఇతర వర్గాల నాయకుల్ని పిలిచి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారని, ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని చెబుతున్నారు. ఆయన రాకతో జిల్లా శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది.
2019లో ఉమ్మడి జిల్లాలో వైఎస్సార్సీపీకి పదికి పది అసెంబ్లీ సీట్లు వచ్చాయి. నెల్లూరు, తిరుపతి ఎంపీలను కైవశం చేసుకుంది. జిల్లాల పునర్విభజనతో కొత్త నెల్లూరులో ఎనిమిది నియోజకవర్గాలున్నాయి. తొలుత వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (వీపీఆర్) పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఎంపీ అభ్యర్థి కూడా ఆయనే. అయితే చంద్రబాబు నాయుడి ప్రలోభాలకు లొంగిపోయి టీడీపీలో చేరారు. దీంతో జిల్లాలో పెద్దన్న పాత్రను పోషించే బాధ్యతను జగన్ విజయసాయిరెడ్డికి అప్పగించారు. ఇది ఆయన సొంత జిల్లా కావడం కలిసొచ్చే అంశం. దీంతో ఇక్కడ అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా సాయిరెడ్డి పనిచేస్తున్నారు. ఓ వైపు తను పార్లమెంట్ బరిలో ఉన్నారు. ఈ ప్రచార కార్యక్రమాలను చూసుకుంటూనే మరోవైపు నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.
అసంతృప్తులు, రాజకీయాలకు దూరంగా ఉంటున్న సీనియర్లపై దృష్టి సారించారు. వారి వద్దకు వెళ్లి సంప్రదింపులు జరిపి పార్టీ కోసం పనిచేసేలా ఒప్పిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డికి కావలి నియోజకవర్గంపై పట్టు ఉంది. ఆయన గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేశారు. తెలుగు తమ్ముళ్ల మధ్య ఇమడలేక చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కావలి అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి గెలుపు కోసం విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. విష్ణుని కలిసి మాట్లాడి వైఎస్సార్సీపీ కోసం పనిచేయాలని కోరగా సానుకూలంగా స్పందించారు. దీంతో విష్ణు ప్రొద్దుటూరులో సీఎం జగన్మోహన్రెడ్డిని కలిసి చర్చించారు.
సీనియర్ నేతలతో విజయసాయిరెడ్డి సమన్వయం చేసుకుంటున్నారు. రోజూ సమావేశాలు నిర్వహిస్తూ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇంకా చేరికలపై దృష్టి సారించారు. నెల్లూరులో పేరున్న మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ను కలిసి మద్దతు కోరారు. ఆయన అంగీకరించారు. ఇది సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్కు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే సాయిరెడ్డి తన పార్లమెంట్ పరిధిలోని కందుకూరు, ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు, ఆత్మకూరు, కావలి, సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. గురువారం మర్రిపాడుకు వెళ్లి నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డితో చర్చలు జరిపారు. ఈసారి కూడా జిల్లాను క్లీన్స్వీప్ చేసి జగన్కు కానుకగా ఇవ్వాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు.