2024-25 విద్యా సంవత్సరంకు మొదటి రోజే విద్యా కానుక కిట్లు ఇచ్చే విధంగా ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది పాఠశాలలు తెరిచిన మొదటి రోజే విద్యా కానుక కిట్లు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఆ వైపుగా అడుగులు కూడా శరవేగంగా వేస్తోంది. ఇప్పటికే టెండర్లు కూడా పూర్తి అయ్యాయి. ఏప్రిల్ చివరి నుంచి పాఠశాలలకు విద్యా కానుక కిట్లు సరఫరా చేయనున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యకు చాల ప్రాధన్యత ఇస్తున్న విషయం విదితమే. రాష్ట్రంలోని 44,617 పాఠశాలల్లో చదువుతున్న 39,51,827 మంది విద్యార్థులకు ఈ విద్యా కనుక కిట్లు అందించనున్నారు ఇందుకోసం రూ.1,042.51 కోట్లతో వీటిని సిద్ధం చేస్తున్నారు. విద్యా కానుక కిట్లు మొదటగా 2020-21 ఏడాదిలో ప్రవేశ పెట్టారు. ఇప్పటి దాకా వరసగా 4 ఏళ్ళు విద్యా కానుక కిట్లు ఇచ్చింది ప్రభుత్వం. గతేడాది ఏ ధరకు వస్తువులను సరఫరా చేశాయో, 2024-25కు సంబంధించి కిట్లోని వస్తువులకు కూడా అదే ధరను నిర్ణయించారు. ఇక ఈ నాలుగేళ్లలో జగనన్నా విద్య కానుక పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.3,366.53 కోట్లు వెచ్చించింది.
విద్యా కానుక కిట్లో నాణ్యమైన స్కూలు బ్యాగు, పాఠ్య, నోటు పుస్తకాలు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, వర్క్స్ బుక్స్ (ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు), ఇంగ్లిష్-తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ (హైస్కూల్), పిక్టోరియల్ డిక్షనరీ, కుట్టుకూలీతో సహా మూడు జతల యూనిఫారం క్లాత్, బెల్టు, టై ఉంటాయి. ఇవి ప్రభుత్వం ఇవ్వడం ద్వారా విద్యార్థులు తల్లితండ్రులకు భారం తగ్గుతుంది. ఇలా అన్ని రకాలైన వస్తువులు పొందిన పిల్లలు మేము కార్పొరేట్ పాఠశాలకు ఏమి తక్కువ కాదు అని భావిస్తున్నారు. విద్యా కానుకలో ఇచ్చే వస్తువులు అన్ని నాణ్యమైనవే, ఆ నాణ్యతను గుర్తించడానికి సదరు కంపెనీలు క్వాలిటీని చెక్ చేసే కంపెనీలను ఏర్పాటు చేసుకున్నాయి. నాణ్యత విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజీ పడడం లేదు.కాగా 2023-24 విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసింది. అంటే. రా మెటీరియల్ నుంచి బ్యాగుల ఉత్పత్తి, స్టాక్ పాయింట్కు చేరే వరకు అన్ని దశల్లోనూ పర్యవేక్షణకు లాభాపేక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం మద్దతుతో నడుస్తున్న ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ సంస్థకు అప్పగించింది. వచ్చే విద్యా సంవత్సరానికి సరఫరా చేసే వస్తువులను సైతం క్యూసీఐ సంస్థే నాణ్యతను పర్యవేక్షించనుంది.