రాజీకీయాలలో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనేది అందరూ అంగీకరించాల్సిన సత్యం.. అందుకు నిదర్శనంగా మాజీ మండలి డిప్యూటీ చైర్మన్ వేంపల్లి సతీష్ రెడ్డి తీరును చెప్పవచ్చు. గత 3 దశాబ్దాలుగా పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ పార్టీ తరుపున నిలబడిన సతీష్ రెడ్డి నేడు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీడీపీలో తనకు గౌరవం దక్కలేదని వెల్లడించిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
1970 నుంచి వైయస్సార్ కుటుంబానికి కంచుకోటగా పేరొందిన పులివెందులలో వేంపల్లి సతీష్ టీడీపీ పార్టీ తరుపున నిలబడ్డారంటే గొప్ప విషయమనే చెప్పొచ్చు కానీ అలాంటి వ్యక్తికి తాను నమ్ముకున్న పార్టీలో గౌరవం లేకపోతే తనని నమ్ముకున్నవారికి ఎలా భరోసా ఇవ్వగలరు? అలాంటిదే సతీష్ రెడ్డి విషయంలో జరిగింది. టీడీపీ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడితే , ప్రాణం పెట్టి పని చేస్తే చివరికి నమ్మిన నాయకుడు చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ ఇద్దరూ కలిసి తనని వైఎస్సార్సీపీతో లాలూచి పడ్డారని వ్యాఖ్యానించడం బాధాకరం అని వేంపల్లిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో సతీష్ రెడ్డి తెలియజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇలాంటి అవమానకర పరిస్థితుల వల్ల తాను క్రియశీలక రాజకీయాలకు దూరంగా ఉండడం వాస్తవమేనని కానీ తనను నమ్ముకున్న కార్యకర్తలు, క్రియాశీలక రాజకీయాలలో తాను ఉండాలని కోరడంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు వేంపల్లి సతీష్ రెడ్డి వెల్లడించారు.
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ వారు పులివెందుల టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత గడిచిన 4 సంవత్సరాలు ఎలా ఉన్నానో పట్టించుకోకుండా వారికి అవసరం ఉంది కాబట్టి నా దగ్గరికి వచ్చారు. కానీ సీఎం జగన్ కు పులివెందులలో గెలుపు నల్లేరు మీద నడక అయినా కూడా నన్ను గుర్తించి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించడం ఎంతో ఆనందంగా అనిపించింది. నేను ఎవరితో పోరాడానో వారు నాకు స్నేహ హస్తం అందిస్తున్నారు. నేను ఎరికోసమైతే ప్రాణాలు ఇవ్వడానికి సిద్దపడ్డానో వాళ్ళు నన్ను పట్టించుకోలేదు. జగన్ మోహన్ రెడ్డి తన వారిని పంపిన తరువాత టిడిపి వారు వచ్చారు. నాలుగేళ్ళుగా నేను టిడిపి వారికి కనబడలేదా? నేను ఎవరివైపు పోవాలో మీరే చెప్పండి? ప్రతి గ్రామంలో మన అందరి గౌరవాలు నిలబడే విధంగా వైసిపిలో చేరడానికి ముందుకు వెళదాము. రాబోయే కాలంలో ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీకి గడిచిన 25 సంవత్సరాలుగా సేవ చేశానో అదే స్ఫూర్తితో అదే కట్టుబాటుతో వైఎస్సార్సీపీలో పనిచేస్తానని బహిరంగంగా ప్రకటించారు.