వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (వీపీఆర్)కు తెలుగుదేశంలో పరిస్థితులు అప్పుడే అర్థమైనట్లు ఉన్నాయి. ఎవరిని నమ్మాలో.. ఎవరిని దూరం పెట్టాలో తెలియక సతమతమవుతున్నారు. చివరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన వారితోనే సన్నిహితంగా ఉంటూ తెలుగు తమ్ముళ్లను దూరం పెడుతున్నారు. దీంతో టీడీపీలో గందరగోళం నెలకొంది.
ఇటీవల వీపీఆర్ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన వద్దకు సీనియర్, చోటా నేతలు క్యూ కట్టారు. శాలువాలు కప్పి సన్మానించారు. డబ్బు కోసమే అందరూ తన వద్దకు వస్తున్నారని వేమిరెడ్డి అనుమానిస్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి దగ్గరి బంధువే అయినా ప్రస్తుతం పార్టీలో ఆయన పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. తన గురించే తాను చూసుకోలేకున్నాడు. చంద్రబాబు టికెట్ ఇస్తాడా.. లేక వెన్నుపోటు పొడుస్తాడా అనే మీమాంసలో ఉన్నాడు. దీంతో వేమిరెడ్డికి దిక్కు తోచడం లేదు.
ప్రస్తుతం వీపీఆర్ నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్రెడ్డి, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్తోనే ఎక్కువగా ఉంటున్నారు. వీళ్లంతా గతంలో వైఎస్సార్సీపీలో ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో సస్పెండ్ అయ్యారు.
కోటంరెడ్డి సోదరులు గతంలోనే చంద్రబాబు పార్టీలో చేరారు. రూపు వీపీఆర్తోపాటు కండువా కప్పుకొన్నారు. గతంలో వారితో ఉన్న పరిచయాల దృష్ట్యా కార్యక్రమాలకు తప్పనిసరిగా వెంట బెట్టుకుని వెళ్తున్నారు. వారి ప్రోగ్రామ్స్కు ఆయనే చీఫ్ గెస్ట్. కొద్దిరోజులుగా ఉదయం వేళల్లో ఆ ముగ్గురితోనే సమావేశమవుతున్నారు. టీడీపీ నాయకులు కలిసినా ఎక్కువ సమయం ఇవ్వడం లేదు. వీపీఆర్ అందర్ని కలుపుకొనిపోతారని భావిస్తే అపనమ్మకంగా వ్యవహరిస్తున్నారని సీనియర్ నేతల్లో చర్చ నడుస్తోంది. ఎంపీ అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న వ్యక్తి ఇలా ఉండడం ఏమిటని, చంద్రబాబు పార్టీలోకి ఎలా తీసుకున్నారని ప్రశ్నిస్తున్న వాళ్లు ఉన్నారు.
పార్టీలో గ్రూపులు, విభేదాలు ఎక్కువ. దీంతో ప్రభాకర్రెడ్డి తన వర్గంగా చూపించుకునేందుకు కోటంరెడ్డి సోదరులు, రూప్కుమార్ యాదవ్ను బాగా నమ్ముతున్నాడని తెలుస్తోంది. కానీ రౌడీయిజం చేయడంలో ఆ ముగ్గురు దిట్ట. వారు ఏదో ఒక రోజు నట్టేట ముంచేస్తారు. అప్పుడు వీపీఆర్కు జ్ఞానోదయం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.