వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. అలాగే రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో భేటీ కూడా అయినట్లు తెలిసింది. నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి పారిశ్రామికవేత్త. 2014 నుంచి వైఎస్సార్సీపీలో ఉన్నారు. 2018లో ఆయన్ను జగన్ పెద్దల సభకు పంపారు. 19లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నెల్లూరు జిల్లాలో వీపీఆర్ మాట బాగా చెల్లుబాటు అయ్యింది. పెద్ద మనిషిగా ఎనలేని ప్రాధాన్యం దక్కింది. ఆయన భార్య ప్రశాంతిరెడ్డి టీటీడీ బోర్డు సభ్యురాలయ్యారు. కొత్త జిల్లా అధ్యక్ష బాధ్యతలను అధిష్టానం ఇచ్చింది. అయితే తాజా పరిణామాలను ఎల్లో మీడియా తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. వీపీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారే తప్ప.. ఆయనకు కనీస గౌరవం దక్కలేదని వేమిరెడ్డి అనుచరులు బహిరంగంగా చెబుతున్నారని ఈనాడు రాసింది. అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల మార్పు విషయంలో ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పింది. కానీ అలాంటిదేమీ లేదు. జగన్ పార్టీ ప్రజాప్రతినిధులంతా ఆయన్ను చాలా గౌరవించారు. వైఎస్సార్సీపీ అధిష్టానం ఏకంగా ఎంపీ సీటు ఇచ్చింది. అయితే ఆయనకు అది సరిపోలేదు. భార్యకు కూడా సీటు అడిగారు.
కారణాలు అనేకం
ప్రశాంతిరెడ్డి తొలుత టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సోదరుడిని వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం ఆయన చనిపోయాక ఆమెకు వేమిరెడ్డితో వివాహమైంది. ప్రశాంతిరెడ్డికి రాజకీయ పదవులు తీసుకోవాలని కోరిక ఉంది. ఆమె 2019లోనే నెల్లూరు రూరల్ సీటు ఆశించారు. అయితే పార్టీ లెక్కలు వేరు. దీంతో నిరాకరించింది. 24లో ఎంపీగా పోటీ చేస్తున్న వీపీఆర్ తన భార్యకు నెల్లూరు సిటీ స్థానం ఇవ్వాలని పట్టుబట్టారు. నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా బీసీని నిలబెట్టాలని నిర్ణయించిన అధిష్టానం సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను అక్కడికి పంపింది. కాగా సిటీ సమన్వయకర్తగా ముస్లిం వర్గానికి చెందిన ఖలీల్ అహ్మద్కు అవకాశం ఇచ్చారు. ఇది వీపీఆర్కు అస్సలు నచ్చలేదు. సొంత సామాజికవర్గ వ్యక్తిని కాదని సామాన్యుడిని ఎలా నియమిస్తారని అలిగి పార్టీకి దూరంగా ఉన్నారు.
వైఎస్సార్సీపీలో ఎవరైనా అసంతృప్తిగా ఉంటే గేలం వేసి తీసుకురావాలన్న ఆదేశాలతో సోమిరెడ్డి రంగ ప్రవేశం చేశారు. ఎలాగూ వేమిరెడ్డితో దగ్గరి బంధుత్వం ఉంది. దీంతో తెరవెనుక కథ నడిపినట్లు సమాచారం. అబ్దుల్ అజీజ్ను బలి చేసి వీపీఆర్కు నెల్లూరు ఎంపీ ఇస్తామన్నారు. సిటీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పొంగూరు నారాయణ ఉన్నారని, రూరల్ సీటు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి ఇవ్వాలని, కోవూరు అసెంబ్లీ అయితే ప్రశాంతిరెడ్డికి ఇస్తామని ఆఫర్ పెట్టారు. చంద్రబాబు ఎన్డీఏలో చేరుతున్నారని, ఎంపీగా గెలిస్తే కేంద్ర సహాయ మంత్రి పదవి ఇప్పిస్తామని ఆశ పెట్టారు. సొంత బంధువు చెబుతున్నాడు కదా అని వీపీఆర్ నమ్మి పూర్తిగా లొంగిపోయారు. సెంట్రల్ మినిస్టర్ అయిపోవచ్చనే భావనలో ఉన్నారు. వాస్తవానికి వేమిరెడ్డికి ప్రజా బలం లేదు. కాకపోతే ఆర్థికంగా బలవంతుడు కాబట్టి తీసుకుని వాడుకుందామని టీడీపీ భావిస్తోంది. అత్యంత గౌరవంగా చూసుకుంటున్న వైఎస్సార్సీపీని వీడితే ఆయనకే నష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పెత్తందారుడైన వీపీఆర్ కోసం బాబు సొంత పార్టీ నేతలకు వెన్నుపోట పొడుస్తున్నారు. ఎంపీ సీటు అడుగుతున్న మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ రాజకీయ జీవితం ఇక ముగిసినట్లే. కోవూరులో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తనయుడు దినేష్రెడ్డి ఇన్చార్జిగా ఉన్నారు. ఇప్పుడు ఇతనికి కాదని ప్రశాంత్రెడ్డికి ఇవ్వాలని చూస్తున్నారు. చాలా ఏళ్లుగా పార్టీలో ఉంటున్న వారి విషయంలో నారా ఇలా ఉంటే రేపు వేమిరెడ్డితో ఉపయోగం లేదని తెలుసుకుంటే వెన్నుపోటు పొడవడం ఖాయం.