మైలవరం టీడీపీ సీటుపై సందిగ్ధత వీడలేదు. దేవినేని ఉమా సైలెంట్ అయినా.. టిక్కెట్ కోసం బొమ్మసాని సుబ్బారావు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కృష్ణప్రసాద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2024 ఎన్నికలు చాలా కీలకమని, టీడీపీకి చావు బతుకుల సమస్య అంటూ కార్యకర్తల సమావేశంలో వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీలో తన భవిష్యత్తు ఏంటో అర్థం చేసుకోవడానికి వసంత కృష్ణ ప్రసాద్ కు ఎక్కువ సమయం పట్టలేదు. వైకాపాలో ఈ ఎన్నికలకు టికెట్ ఇవ్వలేము, ఎన్నికల తర్వాత తగిన గుర్తింపు ఇస్తాము అని చెప్పిన వినకుండా టీడీపీలో టికెట్ హామీతో పార్టీ ఫిరాయించారు . మొదట్లో దేవినేని ఉమా టికెట్ కు అడ్డుతగలగా ఇప్పుడు బొమ్మసాని సుబ్బారావు వంతు అయింది. తనకి టికెట్ రాదని తెలిసి కొత్త రాగం అందుకున్నాడు. ఇప్పుడు తిరిగి వైకాపాలోకి రాలేడు , అటు టీడీపీ లో టికెట్ తెచ్చుకోలేడు.
నేనే మైలవరం అభ్యర్ధి అనుకోవద్దు. నాకు మద్దతివ్వండి.. నాకు టిక్కెట్ ఇస్తేనే సహకరించండని నేను అనడం లేదు. నేను, దేవినేని ఉమా కాకుండా మూడో వ్యక్తి వచ్చినా అంతా కలిసి పనిచేద్దాం. అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటించినా రేపు ప్రచార వాహనంపై అంతే ధీటుగా పని చేస్తా. నాకు, దేవినేని ఉమాకు మధ్య 20 సంవత్సరాల నుంచి రాజకీయ విభేదాలు ఉన్నాయి. అయినా టీడీపీకి చావు బతుకుల సమస్య కాబట్టి కలిసి పని చేద్దాం అంటూ వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు.
మరోవైపు, స్థానికులకే సీటు కేటాయించాలంటూ మైలవరం తెలుగు తమ్ముళ్లు పట్టుబడుతున్నారు. వసంత కృష్ణప్రసాద్కు మైలవరం టిక్కెట్ ఇవ్వొద్దంటున్నాయి టీడీపీ శ్రేణులు . స్థానికుడినైన తనకే టిక్కెట్ ఇవ్వాలని బొమ్మసాని సుబ్బారావు అంటున్నారు. వరుస బలప్రదర్శనలతో చంద్రబాబును బొమ్మసాని కలవరపెడుతున్నారు. చంద్రబాబుని నమ్మి మోసపోయానని వసంత కృష్ణ ప్రసాద్ తన సన్నిహితులు దగ్గర వాపోతున్నారట .