పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల క్రిందట తాను పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. అంతలోనే మళ్లీ బీజేపీ అధిష్టానం అమిత్ షా కోరితే కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని నిన్న సాయంత్రం తన కార్యకర్తలతో జరిగిన సమావేశంలో తెలిపాడు.
ఇదే సమావేశంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా టీ టైం ఉదయ్ ని ప్రకటించాడు. బిజెపి అధిష్టానం కోరితేనే కాకినాడ పార్లమెంట్ కి పోటీ చేస్తాను లేకపోతే ఉదయ్ యే కాకినాడ స్థానం నుంచి పోటీ చేస్తాడని తెలిపాడు. ఇంకా బిజెపి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తీసుకున్న తర్వాత తన నిర్ణయాన్ని తెలియజేస్తానని చెప్పి వెల్లడించారు.అమిత్ షా కోరితే నేను ఉదయ్ స్థానాలు మార్చుకుంటామని అంటే ఉదయ్ పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా, నేను కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాం అని ఈ సందర్భంగా తెలిపారు.
పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని ప్రకటించగానే టిడిపి ఇన్చార్జ్ వర్మ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. ఆ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత వర్మని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు పిలిపించుకొని పవన్ కళ్యాణ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తే మద్దతు ఇవ్వమని కోరాడని, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మాత్రమే మా మద్దతు ఉంటుందని మీడియా సమావేశంలో వర్మ తెలిపాడు. పవన్ కళ్యాణ్ కాకుండా వేరే ఎవరో పోటీ చేస్తే ఇక్కడ పల్లకిలు మోయాడానికి సిద్ధంగా లేమని, పవన్ కళ్యాణ్ పోటీ చేయని పక్షంలో టిడిపి నుంచి తాను కచ్చితంగా పోటీ చేస్తానని కూడా తెలిపారు. పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయడానికి వెళ్తే నన్నే పోటీ చేయమని చంద్రబాబు కూడా ఆదేశించారని ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు.