త్వరలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. పలువురు కీలక నేతలు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటున్నారు.
కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్ పార్టీ కండువా కప్పి వంగవీటి నరేంద్రను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేస్తానని ఈ సందర్భంగా వంగవీటి నరేంద్ర వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్రెడ్డి, రాధా–రంగా మిత్రమండలి సభ్యులు షేక్ బాబు, ఇమ్రాన్ రజా, పి.నరేంద్ర, నాగశ్రీనివాస్ పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో పిఠాపురం రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా పిఠాపురంలో జనసేనకు పెద్ద షాక్ తగిలింది. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన జనసేన పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషుకుమారి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది జనసేన పార్టీకి పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి. సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి శేషుకుమారిని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం పని చేస్తానని శేషు కుమారి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్రెడ్డి, పిఠాపురం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీత పాల్గొన్నారు.