– ఉన్నత విద్యకు వెళ్లేందుకు వీలుగా..
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యలో అనేక సంస్కరణలు తెచ్చింది. పేద పిల్లలు పదో తరగతి తర్వాత చదువు మానేయకుండా ఎక్కడికక్కడ ఇంటర్ కాలేజీలు ఏర్పాటు చేశారు. దీంతో ఉన్నత చదువులకు వెళ్లేందుకు మార్గం ఏర్పడింది. జగన్ పాలనలో నాడు – నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లలా మారడం, పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు డిజిటల్ తరగతులు నిర్వహించడం, బైజూస్ పాఠాలు అందుబాటులోకి రావడం, కొత్తగా ఐఎఫ్పీల ద్వారా విద్యా బోధన ప్రారంభించడం వంటి విప్లవాత్మక మార్పులు వచ్చాయి. గ్రామీణ స్థాయిలో పాఠశాల స్థాయి విద్యకు పెద్దపీట వేయడం ద్వారా కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాలేజీ చదువులకు సైతం కొత్త రూపు కల్పించారు.
గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి పూర్తయిన విద్యార్థులు ఇంటర్ చదివేందుకు సమీపంలోని పట్టణాలకు, లేదా అభివృద్ధి చెందిన గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు వెళ్లాల్సి వచ్చేది. ఇది వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. అప్పట్లో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల కష్టమైనా, ఆర్థికంగా భారమైనా ప్రైవేట్ కాలేజీలను ఆశ్రయించాల్సి వచ్చేది. తద్వారా చాలామంది పదో తరగతి తర్వాత పైచదువులకు వెళ్లేవారు కాదు. ఈ సమస్య పరిష్కారం కోసం సీఎం జగన్ గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీ చదువులకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి మండలంలో రెండు చొప్పున ప్రభుత్వ జూనియర్ కాలేజీలను అందుబాటులోకి తెస్తున్నారు. రాష్ట్రంలో 679 మండలాలు ఉన్నాయి.మొత్తం కళాశాలలు 474. మరో 884 ఏర్పాటు చేస్తున్నారు. దీంతో 1,358 ఇంటర్ కాలేజీలు ఉంటాయి. టెన్త్ పాసైన విద్యార్థులు చేరేందుకు వీలుగా ఆయా మండలాల్లో రెండేసి హైస్కూళ్లలో ఇంటర్ తరగతులు (10 + 2) ప్రారంభిస్తారు. వీటిలో ఒకటి కో-ఎడ్యుకేషన్ కాలేజీ కాగా.. రెండోది ప్రత్యేకంగా బాలికల కోసమే పెడుతున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచే కొత్తవి అందుబాటులోకి రానున్నాయి.