శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పిలవబడుతూ వున్న ప్రాంతం. రాజకీయంగా కూడా మంచి చైతన్యం ఉన్న నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడ రాజకీయ సమరం మంచి వేడి ఎక్కింది అని చెప్పొచ్చు .ఇక్కడ వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, కూటమి తరుపున బొజ్జల సుధీర్ రెడ్డి పోటీలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి ఈ ఐదేళ్లలో చేసిన సంక్షేమం,అభివృద్ది ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. టీడీపీ వారు వైసీపీ పై అవినీతి, సిట్టింగ్ ఎమ్మెల్యే పై వ్యక్తిగత ఆరోపణలతో ప్రచారాన్ని వేడిక్కిస్తున్నారు. బొజ్జల సుధీర్ ప్రస్తుత ఎమ్మెల్యే మధుసూదన్ ని టార్గెట్ చేస్తూ విపరీతమైన అవినీతి చేశారు, నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ది చెయ్యలేదు అని ఆరోపణలు చేస్తుంటే, దానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి జగన్ ప్రభుత్వము ఏర్పడిన రోజు నుండి ఈ రోజు వరకు జరిగిన నియోజక అభివృధ్ధి మీద చర్చకు, అవినీతి అంశం పై చర్చకు సిద్ధమా అంటూ తొడ కొడుతున్నారు అంతే కాకుండా ఈ ముప్పై సంవత్సరాల్లో టీడీపీ ,బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి కి చేసిన అభివృద్ధి ఏమిటో దాని మీద కూడా చర్చకు సిద్ధమా అంటూ సవాలు విసురుతున్నారు. ఇలా ఒకరి మీద ఒకరు సవాళ్లతో శ్రీకాళహస్తి ప్రాంతం రాజకీయ వైరంతో వేడెక్కివున్నది.
వైసీపీ అభ్యర్థి తన సొంత పార్టీలో కొంత నెగటివ్ కనపడుతున్నా, వాటిని సర్దుబాటు చేసుకొని ఎలక్షన్ కు సిద్ధమై వున్నారు. అలాగే జగన్ చేసిన సంక్షేమం, అభివృద్ది, నూతనంగా వేస్తున్న రోడ్లతో ప్రచారంలో ముందున్నారు. టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ కు కూటమిలోని జన సేన నుంచి పూర్తి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే సుధీర్ నేను సైగ చేస్తే జన సేన ఖాళీ అయిపోతుంది కాకుంటే పొత్తులో వున్నాం కాబట్టి వదిలేస్తున్నా అని మాట్లాడి కూటమిలో అలజడి సృష్టించారు. దీనికి కౌంటర్ గా జన సేన పార్టీ నాయకురాలు వినిత మాట్లాడుతూ మేము లేకుంటే నువ్వు గెలవలేవు, శ్రీకాళహస్తిలో జనసేనను ఖాళీ చేసే దమ్ము ధైర్యం ఎవరికీ లేవు అని ఘాటుగా స్పందించారు. మరో కూటమి పార్టీ బిజెపిలో కోల ఆనంద్ కాపు నాయకులకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారు అంటూ బాంబ్ నే పేల్చారు. బిజెపి నుండి బొజ్జల సుధీర్ కు సహాయం పూర్తి స్థాయిలో అందడం లేదు. మరోవైపు తన దూకుడు స్వభావంతో ఎమ్మెల్యే మధు మీద వ్యక్తిగత విమర్శలతో రోజు రోజుకి కొత్త కష్టాలు తెచ్చుకుంటున్నారు.
ఎమ్మెల్యే మధు ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన మంచిని,అభివృద్ధిని పంప్లెట్ రూపంలో నియోజకవర్గం మొత్తం పంచుతూ ఎవరైన సరే దమ్ముంటే మీడియా ప్రతినిధుల సమక్షంలో చర్చకు రావచ్చు అంటూ సవాల్ మీద సవాల్ చేస్తున్నరు. ఈ రెండు పార్టీల మధ్య పోరు ఉత్కంఠ భరితంగా నెలకొని వుంది. చూడాలి ముక్కంటి సన్నిధిలో ఎవరి పక్షాన గెలుపు వుంటుందో.