తెలుగుదేశం జనసేన పొత్తుల వ్యవహారం రాను రాను ముదిరి పాకాన పడుతుంది. సీట్ల సర్ధుబాటు దగ్గరే ఇరుపార్టీనేతలు కత్తులు దూసుకుంటున్నారు. అటు టీడీపీ నేతలు ఇటు జనసేన ఆశావాహులు ఇరువురు ఈసారికి సీటు నాదంటే నాదని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఇరుపార్టీల అభ్యర్ధులు పోటీ విషయంలో పట్టిన పట్టు విడవకపోవడంతో అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు ఎవరికి సర్ధి చెప్పాలో తెలియక మిన్నకుండిపోవడంతో ఇరు పార్టీ అభ్యర్ధులు ఒకటే నియోజకవర్గంలో సీటు నాదే అంటూ ప్రచారం చేసుకొవడంతో క్యాడర్ సైతం ఎవరు తమ అభ్యర్ధిగా ఉంటారో తెలియక అయోమయంలో పడిపోయారు.
ఇప్పటికే ఇరుపార్టీ వారు సీట్ల విషయంలో బహిరంగంగానే బాహా బాహీకి దిగిన సంధర్భాలు ఉన్న ఉమ్మడి గోదావరి జిల్లాలో ఇటీవల హాట్ టాపిక్ గా మారిన మరో సీటు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి సంభందించి తెలుగుదేశం తరుపున సీనియర్ లీడర్ అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి టికెట్ ఆశిస్తూ ఉండగా , మరో పక్క జనసేన తరుపున ఆ పార్టీ సీనియర్ నేత కందుల దుర్గేష్ కూడా టికెట్ నాదే అంటూ ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్నారు.
అగ్గికి ఆజ్యం పోసినట్టు తాజాగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నాడని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది. చంద్రబాబు కన్నా పార్టీలో సీనియర్ అయిన బుచ్చయ్యని పక్కన పెడితే సహించేదిలేదని బహిరంగంగానే హెచ్చరికలు జారీచేస్తుంది క్యాడర్ . రాజానగరం టికెట్ జనసేన ప్రకటించడంతో ఇప్పటికే అసంతృప్తిలో ఉన్న టీడీపీ నేతలు, రాజమండ్రి రూరల్లో సైతం ఇదే పరిస్థితి వస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం మాత్రం. పవన్ కళ్యాణ్ టికెట్లు ప్రకటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
హైద్రబాద్ పర్యటనలో ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం సీటు తనదేనని జనసేన సీట్లు సర్ధుబాట్లు ఏమైనా ఉంటే పక్క నియోజకవర్గాల్లో చూసుకోవాలని చెబుతూనే, అధినేత చంద్రబాబు ప్రకటించేవరకు జనసేన హడావిడిని పట్టించుకోవాల్సిన పనిలేదని తేల్చేసారు. అటు జనసేన ఇటు టీడీపీ సీట్ల వ్యవహారం చూస్తున్న రాజమండ్రి రూరల్ ప్రజలు మాత్రం టికెట్ల దగ్గరే సఖ్యతలేని వీళ్ళు ఒకతాటిపై వచ్చి ప్రజలని బాగుచేస్తారా అంటూ విమర్శించడం గమనార్హం. అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ రాజమండ్రి రూరల్ రచ్చకి ఎండ్ కార్డ్ ఎలా వేస్తారో ఇప్పుడు అందరిలోను ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది.