రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మరింత తీవ్రం కానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది . గత నాలుగైదు రోజులగా కాస్త తగ్గుముఖం పట్టిన, నేటి నుంచి తన ప్రతాపం చూపడానికి సూర్యడు సిద్దమయ్యాడు. వారం క్రితం ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఫలితంగా ఎండలు కాస్త తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్కడక్కడా ఉపశమనం కలిగించేలా వర్షాలు పడినా , వాతావరణ శాఖ అంచనా వేసినట్లు రాష్ట్రం మొత్తంపై వానలు ప్రభావం చూపలేకపోయాయి. దీంతో వానలు ఊరించి ఉసూరుమనిపించాయి.
వర్షాలు ప్రభావం చూపకపోయేసరికి సూర్యడు తన అసలు రూపంలోకి తిరిగి వచ్చేసాడు. ఈ రోజు నుంచి ఉష్ణోగ్రతల తీవ్రంగా పెరుగుతాయిని తద్వారా వడగాడ్పులు కూడా తీవ్ర రూపం దాల్చుతున్నాయి అని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎండ వేడి, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. నెల రోజుల పాటు ఎండలు , వడగాల్పులు తప్పవని తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలంటు సూచనలు జారీ చేసింది. అవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించింది.
కాగా ఆదివారం 35 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 67 మండలాల్లో వడగాల్పులు వీచాయి. నేడు 31 మండలాల్లో తీవ్రవడగాల్పులు,139 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. రేపు 33 మండలాల్లో తీవ్రవడగాల్పులు,113 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో నేటి నుంచి వరుసగా మూడు రోజులు పలుచోట్ల 41 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.