పార్టీల హోరాహోరీ ప్రచారాలు, ఓటర్లకి తాయిలాలు, ఎన్నికల దౌర్జన్యాలు లాంటి కార్యక్రమాలతో ఎట్టకేలకు ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయింది. ఇక ఇప్పుడు అందరి చూపు ఫలితాలపైనే ఉంది. అయితే ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉండటంతో గెలుపోటములపై ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన సంక్షేమ పాలన ద్వార తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేస్తుంటే, తెలుగుదేశం నాయకత్వానికి మాత్రం పైకి తాము అధికారంలోకి వస్తాం అని చెబుతున్నా వారి మనసుల్లో మాత్రం అధికారానికి మళ్ళీ దూరమవుతున్నామనే భయమే ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం వారు అనుకున్న స్థాయిలో కూటమి పార్టీల మధ్య ఓట్లు బదిలీ అవ్వలేదనే అనుమానమే.
ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ సంక్షేమ పాలనను ఢీ కొట్టి గెలవాలి అంటే ఒక్కరివలన కాని పని అనే అభిప్రాయనికి వచ్చిన విపక్ష పార్టీలన్నీ ఏకమై జగన్ ను దించేస్తాం అంటూ ఎన్నికల్లో ప్రచారం ప్రారంభించారు. తెలుగుదేశానికి అధికశాతం కమ్మ సామాజిక వర్గం కొమ్ముకాస్తే , జనసేన పవన్ కళ్యాణ్ కి కాపు సామాజిక వర్గం కాపు కాసిందని వారు నమ్ముతూ వస్తున్నారు. ఇక బీజేపీకి ఏపీలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు లేకపోయినా ఎన్నికల ప్రక్రియలో కేంద్ర స్థాయిలో ఉపయోగపడతారనే ఆలోచనతోనే వారిలో సైతం తెలుగుదేశం చేతులు కలిపింది.
ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో పై స్థాయిలో నాయకులు కలిసినట్టుగా క్రింది స్థాయిలో క్యాడర్ కలవలేదనే అభిప్రాయం ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలించిన అనంతరం వారిలో కలిగిందని చెబుతున్నారు. వంగవీటి రంగా హత్య అనంతరం దశాబ్దాల కాలంగా రాష్ట్రంలో వర్గ శత్రువులుగా ఉన్న కమ్మ , కాపు సామాజిక వర్గాలు ఆశించిన స్థాయిలో కలిసి పనిచేయలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వీళ్ల ఓట్ల బదిలీపైనే ఆశలు పెట్టుకున్న జనసేన , తెలుగుదేశం పార్టీ అధినేతలు ఆ ఓట్ల బదిలీ అనుకున్న స్థాయిలో జరగలేదని, మరోసారి ఎన్నికల ప్రక్రియలో వెనుకపడ్డామనే ఆందోళనలో ఉన్నట్టు సమాచారం.