వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన నాటి నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ తీరు దారుణంగా ఉంది. చర్చలు సజావుగా జరగకుండా అడ్డుకున్న చరిత్ర దానిది. ప్రజలకు లబ్ధి చేకూర్చే విషయాలను పక్కదారి పట్టించేందుకు ఆ పార్టీ సభ్యులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. సోమవారం శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు పదేపదే అడ్డు తగిలారు. సీనియర్లనే జ్ఞానం లేకుండా బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు కామెంట్లు చేశారు.
తొలిరోజు అలా ఉంటే రెండోరోజు మంగళవారం హైడ్రామా సృష్టించారు. అసెంబ్లీలో రచ్చ చేశారు. రెడ్లైన్ దాటి స్పీకర్ తమ్మినేని పోడియంను చుట్టుముట్టారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. విజిల్స్ వేశారు. తాము ప్రజాప్రతినిధులమని మర్చిపోయి పేపర్లు చింపి స్పీకర్పై విసిరారు. తమ్మినేనిని అవమానపరిచేలా నినాదాలు చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. చంద్రబాబు డైరక్షన్లో ఇలా చేస్తున్నారని విమర్శలున్నాయి. గతంలోనూ బాబు అసెంబ్లీలో ఇష్టానుసారంగా ప్రవర్తించిన సందర్భాలున్నాయి.