ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి.. ఈ ముగ్గురికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. రాజకీయంగా అవకాశాలు కల్పించారు. అయితే చంద్రబాబు వెంట నడిచాక వారి పరిస్థితి మారిపోయింది. ఆయన ఆ నేతల భవిష్యత్నే ప్రశ్నార్థకం చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలైన వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుకు ఆశ పడి పార్టీ లైన్ దాటడంతో అధిష్టానం సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి తెలుగుదేశం టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇంత వరకుS స్పష్టత రాలేదు. దీంతో సదరు నాయకుల అనుచరగణం పోయాం మోసం.. అంటూ రాగం అందుకున్నారు.
ఆశించిన స్థానం లేదాయే..
ఆనం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలోని వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాలు తిరుపతి జిల్లాలో, రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. కాంగ్రెస్లో ఉన్నప్పుడు రామనారాయణరెడ్డి మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీ నుంచి 2014 ఎన్నికల్లో బరిలోకి దిగితే డిపాజిట్ గల్లంతైంది. దీంతో టీడీపీలో చేరారు. ఆత్మకూరు ఇన్చార్జి పదవి తీసుకుని పెత్తనం చెలాయించారు. ఇక ఆ పార్టీ అధికారంలోకి రాదని తెలిసి వైఎస్సార్సీపీలో చేరారు. జగన్ చేరదీసి వెంకటగిరి టికెట్ ఇచ్చి అత్యధిక మెజార్టీతో ఆయన్ను గెలిపించారు. అయితే మంత్రి ఇవ్వలేదని ఆనం అలిగారు. తనకంటే జూనియర్లకు ఇచ్చారంటూ ఎప్పుడూ అసంతృప్తితో ఉండేవారు. అయినా ప్రభుత్వం ఆయన అడిగిన పనులన్నీ చేసినా చివరికి చంద్రబాబుకు జై కొట్టారు. జిల్లాలోని ఆత్మకూరులో లోకేశ్ పాదయాత్ర బాధ్యతలు చూశారు. అక్కడి తెలుగుదేశం నాయకులు వ్యతిరేకించినా ఆ నియోజకవర్గం టికెట్ ఆయనకే ఇస్తారని కొంతకాలం ప్రచారం జరిగింది. నేడు ఆ పరిస్థితి లేదు. ఆనం నెల్లూరు సిటీ స్థానం ఆశించారు. అయితే దానిని పొంగూరు నారాయణకు చంద్రబాబు ఇస్తున్నారు. జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, నారాయణకే బాబు తొలి ప్రాధాన్యం ఇస్తారు. దీంతో తనను పట్టించుకోరని ఆనంకు అర్థమైపోయింది. దీంతోపాటు ఆత్మకూరులో గెలవలేమని భావించి ఏం చేయాలో అర్థంగాక తల పట్టుకున్నారు.
సీటుకు ఎసరు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి.. జగన్ పార్టీ పెడితే ఆయన వెంట నడిచారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019లోనూ గెలిచారు. 2024లో టికెట్ లేదని అధిష్టానం సంకేతాలు ఇవ్వడంతో చంద్రబాబు,లోకేశ్ను ఆశ్రయించారు. మాటలతో మాయ చేసే వ్యక్తిగా పేరున్న శ్రీధర్రెడ్డిపై తండ్రీకొడుకులు గతంలో విరుచుకుపడిన సందర్భాలున్నాయి. ఓ జర్నలిస్ట్ను కోటంరెడ్డి తిడుతున్న ఆడియో బయటకు రాగా టీడీపీ సోషల్ మీడియా ఆయనకు వ్యతిరేకంగా అనేక పోస్టులు పెట్టింది. ఇంత జరిగినా ఇక్కడ ఇన్చార్జి అజీజ్ను పక్కకు తప్పించి శ్రీధర్రెడ్డికి బాధ్యతలు ఇచ్చారు. ఈయన రాక అక్కడి తెలుగుదేశం శ్రేణులకు ఎంత మాత్రం ఇష్టంలేదు. ఈ విషయాన్ని బహిరంగంగానే బయటపెట్టారు. ఇదిలా ఉండగా టీడీపీకి ఒక సంప్రదాయం ఉంది. ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటే వారికి నెల్లూరు రూరల్ టికెట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం జనసేన – టీడీపీ కూటమిగా ఉన్నాయి. సిటీలో నారాయణ బరిలో ఉన్నారు. ఆయన్ను తప్పించే ధైర్యం అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ చేయరు. దీంతో జనసేన నాయకులు పాత సంప్రదాయాన్ని చూపించి నెల్లూరు రూరల్ టికెట్ అడుగుతున్నారు. దీంతో శ్రీధర్రెడ్డి, ఆయన తమ్ముడు గిరిధర్రెడ్డి తప్పు చేశామంటూ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఇటీవల ఆనం, కోటంరెడ్డి కలుసుకుని ఒకరి బాధ ఒకరికి చెప్పుకొన్నారు.
టికెట్ కష్టమే..
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి. ఈయన నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తమ్ముడు. వైఎస్సార్ హయాంలో ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పటికి నాలుగుసార్లు గెలిచారు. నిద్ర లేచింది మొదలు జగన్ నామస్మరణ చేసేవారు. 2014లో ఓడిపోయినా 2019లో జగన్ టికెట్ ఇచ్చి గెలిపించారు. ఇప్పుడు చంద్రబాబు వద్ద చేరగా ఆయన టికెట్ ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. అసలు తెలుగు తమ్ముళ్లు ఈయన్ను పట్టించుకోవడం లేదు. ఇక్కడ టీడీపీకి కీలకంగా బొల్లినేని రామారావు ఉన్నారు. 2014లో ఈయన గెలిచారు. 2019లో ఓడిపోయారు. కాంట్రాక్టర్ అయిన ఈయన మరోసారి పోటీ చేయాలని చూస్తున్నారు. పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ నేనే పోటీలో ఉంటానని చెబుతున్నారు. అలాగే ఎన్ఆర్ఐ ఒకరు లోకేశ్ ద్వారా సీటు కోసం ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నారు. టీడీపీ పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల కోసం చంద్రశేఖర్రెడ్డిని వాడుకున్న బాబుకు ప్రస్తుతం ఆయన ఒక కరివేపాకు మాత్రమే.