ఓట్ల కోసం సామాజిక న్యాయం అంటూ మాట్లాడే చంద్రబాబు సీట్ల విషయంలో ఆ సామాజిక న్యాయ సూత్రాన్ని పాటించలేదు.. పొత్తులతో ఎన్నికల బరిలో దిగుతూ ఎప్పటినుండో పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులను మోసం చెయ్యడమే కాకుండా టీడీపీ సీట్ల పంపకం చూస్తే బీసీ వర్గాలనూ, దళితులను, ఆర్ధిక స్థోమతలేని నాయకులను పక్కకి పెట్టేసినట్లు తెలుస్తుంది. బడుగు, బలహీనవర్గాల కోసమే టీడీపీ పుట్టిందని, సామాజిక న్యాయమే మా పార్టీ ఎజెండా అంటూ చెప్పుకుతిరిగే చంద్రబాబు ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనతో బాబు సామాజిక బండారం మరోసారి బయటపడింది. ఎప్పటిలానే ఈసారీ బడుగు, బలహీన వర్గాలను పట్టించుకోలేదని అభ్యర్థుల ఎంపిక రుజువు చేసింది.
రెండు విడతలుగా 128 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ.. ఓసీలకు 72 సీట్లు, బీసీలకు 24, ఎస్సీలకు 25, ఎస్టీలకు 5, మైనారిటీలకు 3 చొప్పున సీట్లు కేటాయించింది. సామాజిక వర్గాలవారీగా విభజించి, తరువాత ధనబలం ఉన్న నాయకులకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ సీట్ల పంపకం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది. టీడీపీ బీసీల పార్టీగా చెప్పుకునే చంద్రబాబు బీసీలకు కేటాయించిన సీట్లు 24 కాగా అందులో మొదటి జాబితాలో 18, రెండో జాబితాలో 6 సీట్లను బీసీ వర్గాలకు ఇచ్చారు. దీనిని బట్టి చూస్తే మాటలతో మభ్యపెట్టే చంద్రబాబు సీట్ల విషయంలో బీసీలను తక్కువగా చూసారని తెలుస్తుంది. మరోవైపు తన సొంత కమ్మ సామాజికవర్గానికి 28 సీట్లు ఇచ్చుకున్నారు. అంటే సొంత సామాజికవర్గానికి ఇచ్చినన్ని సీట్లు కూడా జనాభాలో సగ భాగం ఉన్న బీసీలకు ఇవ్వలేదు. కాపులకు మరీ హీనంగా 8 సీట్లతో సరిపెట్టారు. టీడీపీ ఓసీ సామాజిక వర్గానికే అధికప్రాధాన్యత ఇచ్చినట్లు ఇక్కడ తేటతెల్లమవుతుంది.. గత ఎన్నికల్లో బీసీ వర్గాలకు 43 సీట్లు కేటాయించిన చంద్రబాబు ఈసారి అందులో సగం సీట్లు కూడా కేటాయించకపోవడంతో బీసీ నాయకులకు చంద్రబాబు నాయుడు ఇస్తున్న గౌరవం ఏంటో అర్ధమవుతుంది. ఎస్సీలకు 25, ఎస్టీలకు 4 సీట్లను రిజర్వేషన్ల ప్రకారం కేటాయించారు. మైనారిటీలకు తప్పదన్నట్లు మూడు సీట్లు కేటాయించారు.
అభ్యర్ధుల ప్రకటన అనంతరం టీడీపీ పార్టీలో రేగిన అసమ్మతుల సెగలు చంద్రబాబు చేసిన మోసాన్ని బట్టబయలు చేశాయి. బడుగు బలహీనవర్గాలకు చంద్రబాబు చేసిన అన్యాయం తీవ్రస్థాయిలో దుమారం రేపుతుంది.