ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు ప్రలోభాలకు తెరతీశారు. ఈసారి గెలవకపోతే పార్టీకి భవిష్యత్ ఉండదని అధినేత చంద్రబాబు నాయుడు మదనపడిపోతున్నారు. దీంతో ఓటర్లకు తాయిలాలు ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లను ఆదేశించారు. డబ్బు వ్యవహారాన్ని బాబు ముఖ్య నేతలకు అప్పగించారు. నియోజకవర్గాల్లో నాయకులు ఓటర్లకు ఇచ్చేందుకు వివిధ వస్తువులు సిద్ధం చేస్తున్నారు.
తాజాగా చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం తెల్లగుండ్లపల్లెలోని సర్పంచ్ మోహన్నాయుడు గోదాములో రూ.15 లక్షల విలువ చేసే 745 కుక్కర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం అందడంతో చిత్తూరు రూరల్ సీఐ రవిశంకర్రెడ్డి నేతృత్వంలో సిబ్బంది గోదాములో తనిఖీ చేయగా కుక్కర్ల విషయం బయటపడింది.
ఎన్నికల్లో గెలిచేందుకు ఓటర్లకు డబ్బు, మద్యం, గిఫ్ట్లు ఇచ్చే సంస్కృతికి తెరలేపింది చంద్రబాబే. భారీగా నగదు పంచి గెలిచాక సంపాదించుకోవచ్చని తమ నేతలకు ఆయన రుచి చూపించారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. ఒక్కోసారి తాము పంచి ఇతర పార్టీలపై నెపం నెడుతుంటారు.
24 ఎన్నికలు సమీపిస్తున్నాయి. కోడ్ వస్తే పోలీసుల తనిఖీలు అధికంగా ఉంటాయని ఇప్పటి నుంచే టీడీపీ, సేన నాయకులు డబ్బు, మద్యం, వస్తువులను డంప్ చేసుకుంటున్నారు. ఇటీవల నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ భారీగా డబ్బు కూడబెట్టినట్లు టీడీపీ నాయకులే చెప్పారు. జిల్లాల వారీగా తాయిలాల వ్యవహారం చూసేందుకు కొందరికి బాధ్యత ఇచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా మహిళా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఇరు పార్టీల నాయకులు వంట సామగ్రిని పెద్ద ఎత్తున సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. యువతకు ఇచ్చేందుకు క్రికెట్ కిట్లు, మద్యం బాటిళ్లు తెప్పిస్తున్నారు. ఏపీలో షాపులు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి తొలుత సరిహద్దు జిల్లాలకు మద్యం బాటిళ్లను చేరుస్తున్నారు. తర్వాత నియోజకవర్గాలకు పంపేలా ప్లాన్ వేశారు. అడపాదడపా బయట పడుతున్న మద్యం నిల్వల్లో టీడీపీ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో మద్యం, డబ్బు తదితరాల తరలింపునకు బాబు తన హెరిటేజ్ పాల వ్యాన్లను వాడినట్లు ప్రచారం ఉంది. ఈసారి కూడా అలాగే చేసే అవకాశం లేకపోలేదు. ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి పెడితే ఎల్లో గ్యాంగ్ అకమాలు బయటకొస్తాయి.